హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 21 : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ముక కృష్ణమూర్తి మనువడు ముక నివేష్ (20) మృతి చెందాడు. మృతుడు డాక్టర్ కృష్ణమూర్తి కొడుకు డాక్టర్ నవీన్, స్వాతి దంపతులకు నివేష్, సందేష్ ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు తల్లిదండ్రులతో ఉండి హనుమకొండలోని తేజస్విని పాఠశాలలో ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు.
పెద్ద కొడుకు ముక నివేష్ గత సంవత్సరం జనవరిలో ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అమెరికా అరిజోనా రాష్ట్రంలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం నివేష్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం నివేష్తో పాటు కళాశాలకు చెందిన మరో ముగ్గురు స్నేహితులు కలిసి వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. తిరిగి కారులో వస్తుండగా రాత్రి 11.30 గంటల(అమెరికా కాలమానం ప్రకారం)కు వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు బలంగా వీరిని ఢీకొట్టింది.
దీంతో వెనుక సీట్లో కూర్చొన్న ముక్క నివేష్తోపాటు తన సహచర విద్యార్థి హనుమకొండకు చెందిన గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేశ్ తల్లిదండ్రులు డాక్టర్ నవీన్, డాక్టర్ స్వాతి తెలిపారు. కాగా, ఈ ఘటనపై అరిజోనా పోలీసులు సమాచారం అందించడంతోపాటు అక్కడి పోలీసులు 00026879/2024 ద్వారా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం సుధీర్కుమార్ మక్క కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.