హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 4 : తన గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్, బీఆర్ఎస్తోనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. తనంటే గిట్టని వారు కొందరు తన పాత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోమవారం ఉదయం పీసీసీ అధినేత రేవంత్రెడ్డిని కలిసినట్లు దుష్ప్రచారం చేశారని, వారికి కొంచమైనా సిగ్గు, శరం, లజ్జ ఉండాలని మండిపడ్డారు. తాను గెలిచినప్పటి నుంచి హుజూరాబాద్లోనే ఉన్నానని, ఊరు విడిచి ఎకడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. స్థానిక సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు.
నియోజకవర్గ ప్రజలకు ఎన్నికలప్పుడు ఏమైతే హామీ ఇచ్చానో, తనపై ఎంతో నమ్మకం పెట్టుకొని గెలిపించారో.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నియోజకవర్గాన్ని అద్భుతమైన అభివృద్ధి చేసుకుంటామన్నారు. తనపై కొందరు కక్షగట్టి ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట తప్పనని, మడమ తిప్పనని, గొంతులో ప్రాణమున్నంతవరకు కేసీఆర్ కుటుంబంతోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎవరెన్ని చిల్లర వీడియోలు, ఆడియోలు చేసి, ప్రచారం చేసినా ప్రజలు నమ్మవద్దని కోరారు.
కేసీఆర్ రాష్ట్రంలో అమలుపరిచిన సంక్షేమ పథకాలను కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన పథకాలను అమలు చేస్తూనే పాత పథకాలైన కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, షాదీముబారక్, తదితర పథకాలను అమలు చేయాలన్నారు. తను గెలిచిన తర్వాత ఘన స్వాగతం పలికి, పూల బొకేలతో, శాలువాలతో సతరించిన వారందరికీ కౌశిక్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, రైతు సమన్వయ అధ్యక్షులు, పార్టీ గ్రామశాఖల, వార్డు శాఖల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ మారెట్ కమిటీ చైర్మన్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కౌశిక్రెడ్డి సతీమణి శాలిని, కూతురు శ్రీనికారెడ్డి మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని మన్నించి నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండాల్రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, మండల, పట్టణ శాఖల అధ్యక్షులు సంగెం ఐలయ్య, కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ వార్డుల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.