హుజూరాబాద్, జూన్ 8: ఎన్టీపీసీ ఫ్లైయాష్ తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, రోజుకు 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్లైయాష్ తరలింపులో ఇప్పటి వరకు 100 కోట్ల స్కాం జరిగిందని, అందులో పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని తీవ్రంగా ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ శివారులోని కరీంనగర్ రోడ్డు కాకతీయ కాలువ వద్ద ఫ్లైయాష్ తరలిస్తున్న లారీలను ఆయన అడ్డుకున్నారు. బూడిద తరలింపున కు సంబంధించి వే బిల్లులు ఉన్నాయా..? అని డ్రైవర్ను అడగగా కేవలం ఖమ్మంలోని నేషనల్ హైవేకు తీసుకువెళ్తున్నట్టు చిన్న రిసి ప్టు తప్ప వేరే ఇతర కాగితాలు చూపించలేదని తెలిపారు. అదేవిధంగా అక్కడే ఉన్న 45 టన్నుల కెపాసిటీ గల వే బ్రిడ్జి దగ్గర బూడిదలోడ్తో ఉన్న లారీని కాంట వేయగా జీరోలోడ్ అని చూపిస్తున్నదని, దీన్ని బట్టి చూస్తే కెపాసిటీ కంటే ఎక్కువ బూడిద లారీలో ఉన్నట్టు తెలుస్తున్నదని చెప్పారు.
అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఒక లారీలో 32 టన్నుల బూడిద తరలించాలని, కానీ, అందుకు విరుద్ధంగా 50 నుంచి 65 టన్నుల ఓవర్లోడ్తో తరలిస్తున్నారని చెప్పారు. నిత్యం రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మంకు 300 లారీల ఫ్లైయాష్ రవాణా అవుతుందన్నారు. 32 టన్నుల బూడిద సామర్ధ్యమున్న లారీకి కిరాయి 25 వేలు ఉంటుందని, అయితే ఓవర్లోడ్తో వెళ్తుండడంతో వాహనాలకు కిరాయి తప్పుతుందని తెలిపారు. అందులో నిత్యం 50 లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ జేబులోకి వెళ్తున్నాయని ఆరోపించారు. అధిక లోడుతో వెళ్తున్న లారీలతో రోడ్లు దెబ్బతినడమేగాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల తుమ్మనపల్లి వద్ద బూడిదతో టూవీలర్ అదుపుతప్పడంతో కిట్స్ కళాశాల అధ్యాపకుడు మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలోని రవాణా శాఖ అధికారులను నయానో భయానో లొంగదీసుకొని ఈ తతంగం నడుపుతున్నారని ఆరోపించారు. ఇటీవల 11 లారీలను రవాణాశాఖ అధికారులకు పట్టించానని, అయితే అందులో రెండు లారీలకు మాత్రమే కేసు రాసి మిగతా వాటిని వదిలిపెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.