ఇల్లందకుంట/ జగిత్యాల రూరల్/ రాయికల్/ సారంగాపూర్, ఫిబ్రవరి 24 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులకు వందలాది ఎకరాల్లో మక్క నేలవాలింది. కంకిదశకు వచ్చిన పంట కింద పడడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లీపూర్, రామాజీపేట, తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది.
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్, అర్పల్లి, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామాల్లో 90 మందికి చెందిన 140 ఎకరాలు, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేట, బుజూనూర్, ఇల్లందకుంట, సిరిసేడు, గడ్డివాణిపల్లి, వంతడుపుల, మర్రివాణిపల్లి, రాచపల్లి, మల్లన్నపల్లి, మల్యాల గ్రామాల్లోని 150 ఎకరాలు, జగిత్యాల రూరల్ మండలం చల్గల్, మోరపల్లి, అంతర్గాం గ్రామాల్లో పదెకరాల్లో మక్క నేలవాలింది. రాయికల్ మండలంలో పలుచోట్ల పూత రాలి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలో నష్టపోయిన పంటలను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత రైతులతో కలిసి పరిశీలించి, నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆయాచోట్ల నేల వాలిన పంటలను చూసి రైతులు కంటతడి పెట్టారు. చేతికొచ్చిన దశలో దెబ్బతినడం చూసి బోరుమన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
