రాంనగర్/ కమాన్చౌరస్తా, జూలై 26: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఒక లక్ష్యంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన మేళాకు సుమారు 70కి పైగా వివిధ కంపెనీల నిర్వాహకులు రాగా, జిల్లా నుంచి 5వేల మంది నిరుద్యోగ యువతీయువకులు తరలివచ్చారు. పదో తరగతి నుంచి పీజీ విద్యార్హత కలిగిన ఉద్యోగాల కోసం నిర్వహించిన ఈ జాబ్ మేళాతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వచ్చిన వారందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించారు. 3 వేల మందికి కొలువులు ఇచ్చారు.
యువత జీవితాలను తీర్చిదిద్దుకోవాలి : మంత్రి గంగుల
నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వ రంగంలో 30 శాతం వరకే ఉద్యోగాలు లభిస్తాయని, 70 శాతం అవకాశాలు ప్రైవేట్ రంగాల్లో ఉంటాయని తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.
కమిషనరేట్ పోలీసులు శాంతి భద్రతల విధులు నిర్వర్తిస్తూనే నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఒకే వేదిక మీద వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేందుకు పోలీస్శాఖ చొరవ చూపడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పోలీస్శాఖకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ తోట రాములు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు, అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (ఎల్అండ్వో), జీ చంద్రమోహన్ (పరిపాలన) ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, విజయకుమార్, సీ ప్రతాప్, ఎస్బీఐ జీ వెంకటేశ్వర్లుతోపాటు పలువురు పోలీసు అధికారులు, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి కో-ఆర్డినేటర్లుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేటర్ స్పీకర్ రఘురామరాజు, చందర్ వ్యవహరించారు.
ప్రణాళికతో చదివితే విజయం
నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు సాధించుకునేందుకు ప్రయత్నించాలి. పోటీ పరీక్షల అభ్యర్థులు రోజుకు పది గంటల పాటు ప్రణాళికతో చదివితే విజయం వరిస్తుంది. పట్టుదల లేకపోతే ఏదీ సాధించలేం.
– ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్
సమయాన్ని వృథా చేయద్దు
యువత సమయాన్ని వృథా చేయద్దు. చదువు పూర్తయితే వెంటనే ఉద్యోగాలు చేయాలి. పాశ్చాత్య దేశాల్లో యువత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా ఉద్యోగాలు సాధిస్తుంది. ఇక్కడి యువత కూడా అత్యున్నత స్థానంలో కొనసాగేందుకు కష్టపడాలి. భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా దొరుకుతాయి.
– సత్యనారాయణ, కరీంనగర్ సీపీ
40 మందిని ఎంపిక చేశాం..
హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన మా సంస్థలో ఉత్సాహవంతులైన యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మేళాకు వచ్చాం. మా కంపెనీలో జాబ్ కోసం 120 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో నుంచి మొదట 40 మందిని ఎంపిక చేశాం. ఇక్కడి యువతలో బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తాం.
– దిలీప్ కుమార్, రీజనల్ మేనేజర్, బీ జడ్ ఫెనసర్వ్ ప్రైవేట్ లిమిటెడ్
15వేల జీతంతో ఉద్యోగం
జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉద్యోగ మేళాలో నాకు 15వేల సాలరీతో జాబ్ దొరికింది. నేను చదువుకున్నది ఇంటర్. ఉద్యోగం వస్తుందో.. రాదో అనుకుంటూనే ఇక్కడికి వచ్చా. కానీ, బ్యాంకు సేవల్లో ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావిస్తున్న. దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ముందు వెళ్తా. – మౌనిక, కరీంనగర్
బ్యాంకింగ్ జోన్లో జాబ్
కరీంనగర్లోని ఓ సంస్థలో పార్ట్టైం జాబ్ చేస్తున్నా. ఇక్కడ తక్కువ వేతనం వస్తున్నది. ఉద్యోగ మేళాకు హాజరైనా. బ్యాకింగ్ జోన్లో జాబ్ వచ్చింది. మంచి సాలరీతోపాటు వసతి, భోజనం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇది నాతో పాటు నా కుటుంబ సభ్యులకు సంతోషాన్నిస్తుంది.
– స్వాతి, కరీంనగర్