విద్యానగర్, మార్చి 14: ఏండ్ల కాలంగా ఎవరికీ చెప్పుకోవాలో తెలువక లోలోపలే కుమిలిపోయి.. వ్యాధి ముదిరే దాకా అలాగే ఉంటూ ప్రాణాలమీదికి తెచ్చుకునే మహిళలు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మహిళల నుంచి విశేస స్పందన వచ్చింది. ఉదయం నుంచే కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకుని బారులు తీరారు. ఈ కేంద్రాల్లో అటెండర్ నుంచి వైద్యుల వరకు అందరూ మహిళలే కావడంతో తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు మనసు విప్పి నిర్భయంగా చెప్పుకుని పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇక్కడ పరిష్కారం కాని వారిని పై దవాఖానలకు రెఫర్ చేశారు.
మహిళా వైద్యులే చూడడం బాగుంది
ఆరోగ్య మహిళ కోసం ప్రభుత్వం చేపట్టిన వైద్య శిబిరాల్లో సిబ్బందంతా మహిళలే ఉండడం మేలు. ఏ సమస్య ఉన్నా నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ప్రతి మహిళ ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రతి మంగళవారం సెంటర్కు వచ్చి పూర్తిస్థాయిలో ఏ చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మాలాంటి వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది.
– తేలు స్వప్న, సుభాష్నగర్ (కరీంనగర్)
ఉన్న చోటనే అన్ని పరీక్షలు
ఉన్న చోటనే మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయడం చాలా మేలవుతున్నది. ఈ కార్యక్రమాన్ని మా కాలనీలోనే ప్రారంభించుడు గర్వంగా ఉంది. మేమంతా ఇక్కడే చూయించుకుంటున్నం. సిబ్బంది సైతం కుటుంబంల కలిసినట్లు వైద్యసేవలు అందిస్తున్నరు. గింత మంచి పని చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
–కోదాటి దీపిక, సుభాష్నగర్ (కరీంనగర్)
మంచి నిర్ణయం
తెలంగాణ సర్కారు ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్షనీయం. దవాఖానకు పోవాలంటే మహిళలు ఇబ్బంది పడేటోళ్లు. ఈ సమస్యలను గుర్తించి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఆడవాళ్ల కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషకరం.
– చెట్టిపెల్లి మమత, చొప్పదండి
ముఖ్యమంత్రి సల్లగుండాలె
మేము దవాఖానకు పోవాల్నంటె మస్తు ఇబ్బందయ్యేది. పాణం మంచిగ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రైవేటు మందుల దుఖానానికి వోయి మందులు కొనుక్కొని వేసుకునేటోళ్లం. ఆడోళ్లను చూసే దవఖానాలు లేక పాణం మంచిగ లేనప్పుడు చాలా కట్టమయ్యేది. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ సారు ఆడోళ్ల కోసం దవాఖానలు ఏర్పాటు జేసి మాకు దేవునిలెక్క అయిండు. కేసీఆర్ సల్లంగ ఉండాలె
– నిట్టు గట్టవ్వ, చొప్పదండి
అన్ని పరీక్షలు చేస్తున్రు
ఆరోగ్య మహిళ పథకం ద్వారా స్త్రీలకు పరీక్షలు చేయించడం ఎంతో గొప్ప విషయం. ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తది. మాకు అవసరమైన అన్ని రకాల టెస్టులు చేస్తున్రు. ఇక్కడ అందుబాటులో లేని పరీక్షలను కరీంనగర్కు పంపించి చేయిస్తున్నరు. సర్కారు మహిళల కోసం గింత మంచి పథకం తేవడంతో అందరూ సంబురపడుతున్నరు.
–పీ. రజిత, గద్దలపల్లి (మంథని మండలం)
పైస ఖర్సులేకుంట పరీక్షలు జేసిర్రు
పైస ఖర్సు లేకుంట నాకు థైరాయిడ్ పరీక్ష జేసిర్రు. ఏడాది సంది థైరాయిడ్ వ్యాధితో బాధధపడుతున్న. బస్ చార్జీలు పెట్టుకొని కరీంనగర్కు వోయి థైరాయిడ్ పరీక్ష జేయించుకునెదాన్ని. ప్రైవేట్ దవాఖానకు పోతే డాక్టర్కు జూపిచ్చుకునేదానికే 300 అయ్యేది, మల్ల థైరాయిడ్ పరీక్షకు 800 ఖర్సయ్యేది. మందులు, చిల్లర ఖర్సులు గలిపి 2 వేల దాకా ఒడిసేటియి. ఇప్పుడు సీఎం సార్ మా ఊళ్లనే దవాఖాన్ల అన్ని పరీక్షలు ఫ్రీగనే చేయిస్తండని తెలిసి పోయి సూపిచ్చుకున్న. డాక్టరమ్మ జూసి పరీక్షలు జేసింది. పైస తీసుకోకుంట పరీక్షలు జేసి, కొన్ని మందులు గూడ ఇచ్చిర్రు. పైసలు తప్పుడుతో పాటు పొద్దంత తిరిగే బాధ తప్పింది. ఒక్కదాన్నే పోయిన మంచిగ జూపిచ్చుకొని అచ్చిన. మా మహిళల కోసం ఇంత మంచి సాయం జేస్తున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– ఎ గీత, చల్లూరు (వీణవంక)
వ్యాధి తీవ్రతను రెఫర్ చేస్తాం
మహిళల ఆరోగ్యం కోసం జిల్లాలో ప్రత్యేకంగా మూడు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ శిబిరంలో అటెండర్ నుంచి డాక్టర్ వరకు అంతా మహిళలే ఉంటారు. జిల్లాలోని చొప్పదండి, చల్లూరు ఆరోగ్య కేంద్రాలతో పాటు నగరంలోని బుట్టిరాజారాంకాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశాం. అప్పటికప్పుడే 8 రకాల పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన వారిని కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానాకు రెఫర్ చేస్తాం. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ జువేరియా, డీఎంహెచ్వో (కరీంనగర్)
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలి. ఏ సమస్య ఉన్నా ప్రతి మంగళవారం శిబిరానికి వచ్చి పేరు నమోదు చేసుకొని వైద్య పరీక్షలు చేసుకోవాలి. వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలి. ఏ వ్యాధినైనా ప్రాథమిక దశలో గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ఏడాదికోసారి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసుకోవడంతో పాటు జీవనవిధానంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
– డాక్టర్ సల్మా మహీన్, మెడికల్ ఆఫీసర్, బీఆర్ఆర్ కాలనీ (కరీంనగర్)