వేములవాడ టౌన్, నవంబర్ 20 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తలనీలాలు సమర్పించుకున్నారు.
కోడెమొక్కు చెల్లించుకున్నారు. క్యూలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కళాభవన్లో 90 మంది దంపతులు సత్యనారాయణ వ్రతాలు, 113 మంది దంపతులు కల్యాణాల మొక్కులు నిర్వహించుకున్నారు. రాజన్నను 30వేల మంది దర్శించుకోగా, ఆలయానికి వివిధ ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ.22 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.