రాయికల్ ( జగిత్యాల ) : డిజిటల్ రేషన్ కార్డుపై బొమ్మ ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ రెండు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటాడో, లేదో అది మాత్రం అధిష్టానం చేతులలో ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ( Former Minister Jeevan Reddy ) అన్నారు. రేవంత్ అభద్రత భావనలో ఉన్నాడని ఆరోపించారు.
ఆదివారం రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించేందుకు కుట్ర చేస్తుందని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయకుండా ఆర్భాటాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, పేర్కొన్నారు. రైతు బీమాను నిలిపివేయడం , కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ చేపట్టకపోవడాన్ని గమనిస్తే కేసీఆర్ పథకాలను తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 33 మాసాలు గడుస్తున్న ఇప్పటివరకు మహిళ లక్ష్మీ పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆటో కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్న పథకాలు అమలు చేయడం లేదని వివరించారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను ప్రభుత్వ నిలిపివేసే కుట్ర చేస్తుందని అన్నారు.