గంగాధర, మార్చి 18 : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావడంలో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హస్తం ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. గంగాధర మండలంలోని బూరుగుపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ పచ్చి అవకాశవాది అని, తన స్వార్థ ప్రయోజనాల కోసం యువతను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులంతా బీజేపీ కార్యకర్తలే అని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే సంజయ్ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మతం పేరుతో యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రభుత్వ పనితీరు, వ్యవస్థపై బండికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది, రాష్ర్టానికి కంపెనీలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది మంత్రి కేటీఆర్ అని స్పష్టం చేశారు. బండి సంజయ్ చిల్లర రాజకీయాలు చేస్తూ యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, పులి వెంకటేశ్గౌడ్, వెల్మ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, తదితరులు పాల్గొన్నారు.