ఆమె ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ధీమానిస్తున్నది. మార్చి 8న ఉమెన్స్ డే రోజు సందర్భంగా ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టి, భరోసానిచ్చింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలోని 15 పీహెచ్సీల్లో కేంద్రాల్లో సేవలు ప్రారంభించి, ప్రతి మంగళవారం ఎనిమిది రకాల పరీక్షలు ఫ్రీగా చేసింది. ఇప్పటికే 35,092 మంది మహిళలకు టెస్టులు చేసి, అవసరమైన చికిత్సతోపాటు మందులు అందజేస్తుండగా, తాజాగా మరో 14 కేంద్రాల ఏర్పాటుకు అనుమతించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి బస్తీ దవాఖానలో మంత్రి గంగుల కమలాకర్ సెంటర్ను మంగళవారం ప్రారంభించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆయా జిల్లాల్లోని కేంద్రాలను కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రారంభించనుండగా, మహిళల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 11, (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్: మహిళలు శక్తివంతులుగా ఉన్నప్పుడు బలవర్థకమైన సమాజం ఆవిష్కృతం అవుతుందన్నది ఆర్యోక్తి. అయితే, శతాబ్దాలుగా మహిళ, అరోగ్య విషయాల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నది. కుటుంబం మేలు, సమాజం ఉన్నతి కోసం నిరంతరం తపించే ‘ఆమె’ ఆరోగ్యంపై సమాజం, కుటుంబం, చివరికి ఆమెపై ఆమె సైతం శీతకన్ను వేస్తూనే ఉన్నది. దీంతో మహిళలు అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడి విలువైన జీవితాన్ని కోల్పోతూ వస్తున్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యతే.. తత్ర రమంతే దేవతా’ అన్న ఆర్యోక్తిని అక్షరాల నమ్మే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాణాంతకమైన, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు, శారీరక, మానసిక ఇబ్బందులను ముందుగానే గుర్తించి అవసరమైన పక్షంలో వారికి వైద్య సేవలు అందించేందుకు పూనుకొన్నారు.
ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే వైద్యం, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు గాను ‘ఆరోగ్య మహిళ’ అనే మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 27 వారాల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది. మహిళలు ఎదుర్కొనే కీలకమైన సమస్యలతోపాటు, ప్రాణాంతక రుగ్మతల నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారిని ప్రధాన దవాఖానలకు రెఫర్ చేసే కార్యక్రమం జరుగుతోంది. అధునాతన పరీక్షలు నిర్వహిస్తూ మహిళల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు నారీలోకం ధన్యవాదాలు చెబుతోంది. కాగా, ఆరోగ్య మహిళ కార్యక్రమం సరైన ఫలితాలను ఇస్తుండడంతో ప్రభుత్వం మరికొన్ని మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎనిమిది రకాల పరీక్షలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవం రోజున 15 సెంటర్లను ప్రారంభించగా, ఇప్పటివరకు 27 వారాల్లో 35,092 మందికి పరీక్షలు చేశారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు, చొప్పదండి మండల కేంద్రంలోని పీహెచ్సీలు, బుట్టిరాజాంరాం కాలనీలోని యూపీహెచ్సీలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇప్పటివరకు 9,168 మందికీ పరీక్షలు చేశారు. 699 మందిని ఇతర ప్రభుత్వ దవాఖాన్లకు పంపించి చికిత్స అందించారు. 4,713 మందికి స్థానికంగానే వైద్య సేవలు అందించారు. ఒక ఐదుగురిలో వ్యాధులు ముదిరినట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, హైదరాబాద్ దవాఖాన్లకు పంపించారు.
జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో 11,297 మంది మహిళలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడంతో పాటు, కౌన్సెలింగ్ సైతం అందజేశారు. వివిధ రకాల పరీక్షల అనంతరం 625 మంది మహిళలు దీర్ఘకాలిక, ప్రమాదకరమైన శారీరక, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని గుర్తించి వారిని పెద్దాసుపత్రులకు రెఫర్ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన మంథని మండలం గద్దలపల్లి, రామగుండం యూపీహెచ్సీ, పెద్దపల్లి యూపీహెచ్సీల్లోని ఆరోగ్య మహిళ కేంద్రాల్లో 5177 మంది మహిళలకు వివిధ రకాల పరీక్షలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, నేరెళ్ల, వేములవాడ పీహెచ్సీలు, సుందరయ్యనగర్ యూపీహెచ్సీల్లోని సెంటర్లలో ఇప్పటివరకు 9450 మందికి పరీక్షలు చేశారు.
కొత్తగా.. మరో 14 సెంటర్లు..
కరీంనగర్లోని రేకుర్తి, తీగలగుంటపల్లి బస్తీ దవాఖానలు, ఇల్లందకుంట, సైదాపూర్ మండలకేంద్రాలతో పాటు కరీంనగర్ మండలంలోని చామనపల్లి, రామడుగు మండలంలోని గుండి పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కాగా, కరీంనగర్లోని రేకుర్తి బస్తీ దవాఖానలోని సెంటర్ను మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే లలితాదేవి తెలిపారు. మిగతా కేంద్రాలను స్థానిక ప్రజాత్రినిధులు ప్రారంభించనున్నారు.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రామగుండం నియోజకవర్గంలోని అల్లూరు, లక్ష్మీపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కాగా, మంగళవారం రాఘవాపూర్ సెంటర్ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే దాసరి, అల్లూరు, లక్ష్మీపూర్ సెంటర్లను కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రారంభించనున్నారు.
జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, సారంగాపూర్, గొల్లపల్లి పీహెచ్సీలలో కేంద్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కాగా మంగళవారం సారంగాపూర్, మల్లాపూర్ సెంటర్లను ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, విద్యాసాగర్రావు ప్రారంభించనున్నారు. గొల్లపల్లిలోని కేంద్రాన్ని ఈ నెల 19న మంత్రి కొప్పుల ప్రారంభించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలం పోతుగల్ పీహెచ్సీ, ఇల్లంతకుంట పీహెచ్సీలో ఒక్కో కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కాగా, మంగళవారం ఇల్లంతకుంట సెంటర్ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించనుండగా, పోతుగల్ సెంటర్ను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
మహిళల పాలిట ప్రయోజనకరం
ఆరోగ్య మహిళ కేంద్రాలు గ్రామీణ మహిళలకు అత్యంత ప్రయోజనకరమని చెప్పాల్సిందే. సమాజం ఎంత అభివృద్ధి చెందినా గ్రామీణ ప్రాంత మహిళలు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా చాలా మందిలో ఆరోగ్య సమస్యలపై వారికే సరైన అవగాహన లేకుండా పోయింది. ఒకవేళ కొంత అవగాహన ఉన్నప్పటికీ దవాఖాన దాకా వచ్చి ధైర్యంగా చూపించుకోలేకపోతున్నారు. దీంతో సమస్యలు ముదిరిపోయి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం మహిళల కోసమే ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఈ కేంద్రాల్లో మహిళలకు ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. టీ హబ్ సహకారంతో 64 రకాల రక్తపరీక్షలు అందుబాటులో ఉన్నాయి. 27 వారాలుగా ఆరోగ్య కేంద్రాల్లోకి మహిళలు వస్తున్నారు.
ప్రధాన సమస్యలపై స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైతే రెఫర్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు మోనోపాజ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే, రక్తహీనత అనేది చాలా అధికంగా కనిపిస్తోంది. ఈ సమస్యలకు వైద్యంతో పాటు, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఆరోగ్య మహిళ కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. మహిళల్లోనూ ఇప్పుడిప్పుడే ఆరోగ్యపరమైన అంశాలపై కొంత అవగాహన ప్రారంభమైంది. కాగా, కొత్తగా మరో మూడు ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిని మహిళలు వినియోగించుకోవాలి.
– డాక్టర్ పీ శ్రీధర్, డీఎంహెచ్ఓ (జగిత్యాల)