కమాన్చౌరస్తా, అక్టోబర్ 7 : టెంపుల్ సిటీగా కరీంనగర్ జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఇటు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికలో నగరం శాంతి, సౌభాగ్యాలతో వెలుగొందనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎదురుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న రాధాకృష్ణల ఆలయానికి శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ డాక్టర్ గోపి, ఇస్కాన్ బాధ్యులు నరహరి ప్రభుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మనం చాలా దేవాలయాలకు వెళ్లామని, దేవళ్లకు పూజలు చేస్తాం కానీ, ఆ దేవాలయం ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదన్నారు. కానీ, జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇస్కాన్ రాధా శ్రీకృష్ణు మందిర పునాది రాయి వేయడంలో భాగస్వాములమైన, మనమంతా చరిత్రలో నిలువనున్నామన్నారు. కరీంనగర్ ఒక టెంపుల్ సిటీగా మారనున్నదన్నారు. ఒక వైపు రేకుర్తిలో శంకుచక్రాలతో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం, మరోవైపు రాధాశ్రీకృష్ణస్వామి ఆలయం కొలువుదీరనున్నాయన్నారు. ఈ రాధాకృష్ణ మందిరం హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో దాదాపు మూడెకరాల స్థలంలో రూ.25 కోట్లతో నిర్మాణం జరగనున్నదన్నారు. అక్టోబర్ 6నే తిరుమల తిరుపతి దేవస్థానానికి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, ఇస్కాన్ బాధ్యులు నరహరి ప్రభు, ఆలయ నిర్మాణ బాధ్యులు డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి మాట్లాడగా, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్, డాక్టర్ బుర్ర మధుసూధన్ రెడ్డి, కోమళ్ల రాజేందర్రెడ్డి, మం దల నగేశ్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, రాజిరెడ్డి, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ పాల్గొన్నారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న రాధాశ్రీకృష్ణ మందిరంతో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. సేవా భావం పెంపొందేలా ప్రోత్సహించే సంస్థ ఇస్కాన్. వాళ్ల ఆధ్వర్యంలో అక్షయ పాత్ర ద్వారా ఇప్పుటికే నగరాల్లో అతితక్కువ ఖర్చుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కరీంనగర్ రివర్ఫ్రంట్ సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆలయంతో నగరం పర్యాటకంతోపాటు ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి సాధిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం మూడు నెలలైనా పూర్తి కాలేదని పలువురు మాట్లాడడం సరికాదు. అది కాంక్రీట్ సిమెంట్తో నిర్మించే ఆలయం కాదు. తమిళనాడులోని శిల్పులతో నిర్మాణాలు తయారు చేయించి, సంస్కృతి ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం చేపడుతాం. సీఎం కేసీఆర్ సహకారంతోనే నగరంలో ఇంతలా అభివృద్ధి చెందుతున్నది. దీనికి పూర్తి స్థాయిలో మంత్రి గంగుల ఆలోచనా విధానం ఎంతో సహకరిస్తున్నది.