కార్పొరేషన్, అక్టోబర్ 1: ‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. వారు చెప్పే మాటలు, ఇచ్చే హామీలు నమ్మితే మోసపోతం. తెలంగాణలో పెరిగిన సంపదను, కరెంట్, నీళ్లను దోచుకపోతరు. మళ్లీ వెనక్కి పోతం’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని 11, 1, 2, 4, 5, 27, 6 డివిజన్లల్లో రూ.133 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమిపూజ చేసి, మాట్లాడారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు.
తెలంగాణ రాకముందు నగరంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉండేవని, గత ప్రభుత్వాలు 70 ఏండ్ల పాలనలో నగరంలో చేసింది శూన్యమని మండిపడ్డారు. రోడ్లన్నీ గుంతలతో అధ్వానంగా ఉండేవని, పక్కనే మానేరు డ్యాం ఉన్నా మహిళలు మంచినీటి కోసం ఎన్నో తిప్పలు పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో..? అభివృద్ధి ఎలా సాగిందో మీ కండ్ల ముందే కనిపిస్తున్నదని వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే ఇక్కడ ఆ పార్టీకి స్థానం లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు మూడుసార్లు అవకాశం ఇచ్చారని, ప్రజల రుణం తీర్చుకునేందుకే నగరాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ కాంగ్రెస్, బీజేపీలు వస్తున్నాయన్నారు. తెలంగాణ వస్తే గుడ్డిదీపం అవుతుందన్న మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడు బీజేపీ ముసుగు వేసుకొని వస్తున్నారని, కాంగ్రెస్ ముసుగులో షర్మిల, రాంచంద్రారావు వస్తున్నారని విమర్శించారు. మన నిధులు, నీళ్లపై కన్నేశారని దుయ్యబట్టారు.
అభివృద్ధి చేసుకున్న తెలంగాణను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా మార్చుకుంటున్నామని, ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని పూర్తి చేసుకున్నామని, త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ కూడా పూర్తి చేసుకుంటే ప్రపంచస్థాయిలో కరీంనగర్కు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ను గెలిపించాలని సూచించారు. అనంతరం మేయర్ సునీల్రావు మాట్లాడుతూ, నగర ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
కట్టరాంపూర్లోని అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మార్చుతున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే పట్టంగట్టాలని, మంత్రి గంగుల కమలాకర్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ పాలకవర్గం వచ్చిన తర్వాత నగరంలో వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. మొదలుపెట్టిన పనులను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు ఆకుల నర్మద నర్సయ్య, ఐలేందర్యాదవ్, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, కోలగాని శ్రీనివాస్, కోల మాలతి, గౌసియాబేగం, జహీరాబాన్, బీఆర్ఎస్ నాయకులు నలువాల రవీందర్, సూర్యశేఖర్ ఉన్నారు.