‘ఇందిరమ్మ ఇండ్ల పథకం అవినీతిమయంగా మారిందా..? ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా..? అర్హులు.. అనర్హుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారా..? పైసలిస్తేనే లిస్టులో పేరు నమోదు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సోమవారం కోరపల్లి గ్రామస్తులు కరీంనగర్లో కలెక్టర్కు ఇందిరమ్మ కమిటీ సభ్యుల అక్రమ వసూళ్లపై ఆధారాలతో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతున్నది.
జమ్మికుంట, మార్చి17 : గూడులేని నిరుపేదలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, లబ్ధ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నాయకులు, సానుభూతిపరులకు కమిటీ బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం ఉన్నది. అయితే ఈ కమిటీ సభ్యులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అనర్హులకే ఇండ్లు మంజూరు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జమ్మికుంట మండలంలో 20 గ్రామాలుండగా, మొదటి విడుత కింద 359 ఇండ్లు మంజూరయ్యాయి.
మండలంలోని కోరపల్లి గ్రామానికి మొదటి విడుతగా 32 ఇండ్లు రాగా, ప్రస్తుతం ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. కాగా, ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని, లక్షలాది రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గ్రామానికి మొగిలిపాక లక్ష్మణ్, గండి చంద్రమోహన్ సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రాకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల సంతకాలతో కూడిన ఫిర్యాదును ప్రజావాణిలో అందజేశారు.
కొందరి వద్ద నుంచి యూపీఐల ద్వారా నగదు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇందిరమ్మ కమిటీ సభ్యుల అరాచకం అంతా.. ఇంతా కాదని తెలుస్తున్నది. వసూళ్ల సమయంలో బెదిరింపులకు సంబంధించిన ఆడియోలు ఫిర్యాదుదారుల వద్ద ఉన్నట్టు తెలిసింది. మొదటి విడుత ఎంపిక పారదర్శకంగా జరుగలేదని, మొదటి విడుత వసూళ్లు చేశారని, ఇప్పుడు రెండో విడుత అక్రమ వసూళ్లకు తెరలేపారని ఆరోపించారు.
ఇండ్ల ఎంపికకు ముందే.. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 15వేల నుంచి 50వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్లు రావాలన్నా.. లిస్టులో పేరుండాలన్నా.. ఎంతో కొంత ముట్ట జెప్పాలని, లేకుంటే ఇళ్లు రాదని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులుగాని, పాలకులుగాని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ‘ఇందిరమ్మ’ వసూళ్లపై ఎంపీడీవో పద్మజ, హౌసింగ్ ఏఈ ఐశ్వర్యను వివరణ కోరగా, ఫిర్యాదు విషయం తెలిసిందని, విచారణ జరుగుతున్నదని చెప్పారు.