నాడు వస్త్ర పరిశ్రమ కుదేలు.. ఆగమైన నేతన్నలు.. ఉపాధి కోసం వలసలు.. అప్పుల బాధలు.. ఆకలిచావులు.. ఆత్మహత్యలు.. రోడ్డునపడ్డ కుటుంబాలు.. ఇలాంటి సంక్షోభాలను చూసిన కార్మికలోకం, నేడు సంతోషాల వైపు అడుగులు వేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో కొత్త వెలుగులు నింపుకున్నది. అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో తేరుకొని నిలదొక్కుకుంటున్నది. తాజాగా ‘రైతుబీమా’ తరహాలో ‘నేతన్న బీమా’ పథకాన్ని తెస్తుండడంతో ఆనందపడుతున్నది. ఈ నెల 7వ తేదీన జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పథకాన్ని ప్రారంభించనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నది. నాడు ఆత్మహత్యలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని, ప్రమాదవశాత్తూ కార్మికులెవరైనా చనిపోతే రైతుల లెక్క ఆ కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నది.
కొత్తపల్లి ఆదర్శ-2 సొసైటీలోని చేనేత మగ్గాలు
కరీంనగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వస్త్రపరిశ్రమకు జీవం పోస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో పూర్వవైభవం తెస్తున్నారు. నేతన్నల నాలుగు వేళ్లు నోట్లోకి పోయేందుకు చేతి నిండా పని కల్పిస్తున్నారు. ప్రభుత్వ విద్యార్థుల యూనిఫాంలు, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తున్నారు. ఉపాధి చూపడమే కాకుండా వేతనాలు పెరిగేలా చేశారు. ఇంకా అనేక పథకాలు అమలు చేయడంతోపాటు మగ్గాల ఆధునికీకరణ, కార్మికులకు త్రిప్టు లాంటి పథకాలు అమలు చేయిస్తున్నారు. త్రిఫ్ట్ పథకం కింద కార్మికుడు 8శాతం జమచేస్తే, ప్రభుత్వం మరో 8 శాతం కలిపి 16శాతం ఖాతాల్లో జమ చేస్తున్నది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ యేడాది ఫిబ్రవరి వరకు కరీంనగర్ జిల్లాలో 1,413 మంది అకౌంట్లలో 13,65,700 చొప్పున జమ చేసింది. కరోనా సమయంలో ఒక్కో చేనేత పారిశ్రామికుడు 50వేల నుంచి 70 వేల వరకు వీటిని పొందారు. ఈ పథకం తమకెంతో మేలు చేసిందని నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా చేనేత మిత్ర పథకం కింద నూలు సబ్సిడీ ఇస్తున్నది. కరీంనగర్ జిల్లాలోని 19 చేనేత సహకార సంఘాల పరిధిలోని సభ్యులందరికీ ఇప్పటి వరకు 3.31 కోట్లు మంజూరు చేసింది. చేనేత సహకార సంఘాలకు రుణ పరిమితి సౌకర్యం (క్యాష్ క్రెడిట్) కింద 19 చేనేత సహకార సంఘాలకు జిల్లా సహకార బ్యాంకు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి 3.54 కోట్లు మంజూరు చేసింది. అంతే కాకుండా 857 యూనిట్లలో పని చేస్తున్న 2,696 పవర్ లూం సభ్యులకు 50 శాతం విద్యుత్తు సబ్సిడీని ఇస్తున్నది. సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కులోని మరమగ్గాల యూనిట్లకు విద్యుత్ సబ్సిడీ కింద 16 కోట్లు కే టాయించింది. ఇలా అనేక పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూం, పవర్ లూం పారిశ్రామిక కుటుంబాలను ఆదుకుంటున్నది.
నేతన్నకు బీమాధీమా
రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని అమలులోకి తెస్తున్నది. గతేడాది జూలై4న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు.. చేనేత, మరమగ్గాల పారిశ్రామిక కుటుంబాలకు రైతుబీమా తరహాలో ‘నేతన్న బీమా’ను అమలు చేయనున్నది. ఈ నెల 7 జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించనున్నది. 18 నుంచి 59 ఏండ్ల వయసున్న ప్రతి ఒక్కరినీ చేర్పించనున్నది. ఒక్కొక్కరికీ 2,271.50 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 వేల మందికి సంబంధించి ఏటా 3.40 కోట్ల భారం ప్రభుత్వంపై పడనున్నది. ఈ పథకం ద్వారా నేతన్నలకు ధీమా లభించనున్నది. దురదృష్టవశాత్తూ ఎవరైనా కార్మికుడు ప్రాణాలు కోల్పోతే కుటుంబానికి 5 లక్షలు అందించి, ఆర్థికో భరోసా కల్పించనున్నది.
తెలంగాణ వచ్చినంకనే న్యాయం
తెలంగాణ వచ్చినంకనే మాకు న్యాయం జరిగింది. అంతకుముందు ఎవ్వరూ పట్టించుకోలె. చేద్దామంటే పని లేక, తిందామంటే తిండి లేక శానా మంది ఆత్మహత్యలు చేసుకున్నరు. ఈ రంగాన్ని నమ్ముకుని బతక లేమని శానా మంది వేరే పనులు చూసుకున్నరు. ఇప్పుడు ఇదే పనిని నమ్ముకుని బతుకుతున్న వాళ్ల కోసం కేసీఆర్ గొప్ప ఆలోచనలు చేస్తున్నరు. మేం అడగకున్నా మాకు కావల్సినవి ఇస్తున్నరు. ప్రతి 36 నెలలకు ఒకసారి తీసుకునే త్రిఫ్ట్ ఫండ్ శానా ఉపయోగపడుతున్నది. రుణాలు తీసుకుంటే పావలా వడ్డీకి ఇస్తున్నరు. రంగులపై 40 శాతం రాయితీ ఇస్తున్నరు. మరమగ్గాలకు 50 శాతం కరెంటు ఫ్రీగా ఇస్తున్నరు. గతంల ఇఫ్కో నుంచి రావాల్సిన బకాయిలు ఏండ్లకేండ్లు పెండింగ్ ఉండేవి. నేసిన బట్టలు తీసుకునెటోళ్లుగాదు. ఇప్పుడు నెలకోసారి కొంటున్నరు. కొన్నంకనే బిల్లులు ఇస్తున్నరు. ఇప్పుడు నేతన్న బీమా కూడా మా బతుకులకు ఎంతో భరోసాగా నిలుస్తది. ఇలాంటి పథకం తెచ్చిన కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– చిలగాల యాదగిరి, మల్కాపూర్
ఇది పేదోళ్ల సర్కారు
కేసీఆర్ సర్కారు పేదోళ్ల కోసం పని చేస్తాంది. పని చేసుకుంటేనే కడుపు నిండే మాలాంటోళ్లకు బీమా ప్రవేశపెట్టడం చాలా సంతోషంగ ఉంది. గతంల నేతన్నల బాగోగులు పట్టించుకున్నేళ్లే లేరు. నేత కార్మికులకు బీమా ప్రవేశపెట్టడం కేసీఆర్ పెద్ద మనుసుకు నిదర్శనం.
–కామని సదానందం, కార్మికుడు, బోర్నపల్లి (హుజూరాబాద్)
కేసీఆర్ సారు మేలు మరమలేనిది
నేత కార్మికులకు ఇప్పటికే సర్కారు నెలనెలా పింఛను ఇత్తుంది. ఇప్పుడు బీమా ఇచ్చుకుంట కేసీఆర్ సారు కుటుంబానికి భరోసా ఇత్తుండు. నిజంగ చాన సంతోషమైతంది. ఈ రోజుల్ల ఎవరిని అడిగినా పైసలు ఇయ్యరు అసొంటిది పెళ్లికి రూ.లక్ష ఇచ్చి కేసీఆర్ పెద్ద కొడుకులా కూతురున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నడు. కేసీఆర్ సారూ మేలు మరమలేనిది.
– పోగు పద్మ, కార్మికురాలు (హుజూరాబాద్)
కడుపుల పెట్టుకుని చూసుకుంటున్నది
కొత్త పథకాలు అమలు జేస్తూ తెలంగాణ సర్కారు మమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది. మేం ఇచ్చల్కరంజి, భీవండి, సూరత్లలో పని చేసినం. అక్కడ గిట్లాంటి పథకాలే లేవు. మేం పనిచేసే యజమాని కూడా మమల్ని పట్టించుకోలే. ఇక్కడ సర్కారు చేతినిండా పనిచ్చింది. పొదుపు చేసుకుంటే సగం పైసలు మా పేరిట జమ చేసింది. ఇప్పుడు కొత్తగ బీమా సౌకర్యం కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగ ఉన్నది. ఇదంతా కేటీఆర్ సార్ దయవల్లనే. మాకు అండగ నిలిచిన ఆయనకు రెండు చేతులా దండం పెట్టుకుంటున్నం.
– గంగిశెట్టి నరేందర్, మరమగ్గాల కార్మికుడు సుద్దాల
కోనరావుపేట మండలం
ఒకప్పుడు పట్టించుకున్నోళ్లు లేరు
తెలంగాణ సర్కారు నేతన్న బీమాను తీసుకువచ్చి మా కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చింది. దాదాపు నేను 40 ఏండ్ల సంది నేత కార్మికుడిగా పని చేస్తున్న. గతంల గర్శకుర్తితోపాటు బొంబాయి, భీవండిల కూడా పని చేసిన. ఎక్కడా మా నేత కార్మికులను పట్టించుకున్నోళ్లు లేరు. ఇంటికి పెద్ద దిక్కు చనిపోతే ఇక ఆ కుటుంబం పరిస్థితి పూర్తి దయనీయంగా ఉండేది. ఎవరూ పట్టించుకోరు. ఎక్కడికి పోవాల్నో.. ఏం చేయాల్నో తెల్వది. నేతన్న బీమా పథకంతోని మా జీవితాల్లో వెలుగులు తీసుకస్తున్న కేసీఆర్ సారుకురుణపడి ఉంటం.
– సామల భూమయ్య, నేత కార్మికుడు, గర్శకుర్తి (గంగాధర)
చారిత్రక నిర్ణయం
నేతన్న బీమా వంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నరు. మా ఊరిలో 700 మంది కార్మికులు చేనేత రంగంపై ఆధారపడి బతుకుతున్నరు. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలే. నేతన్న బీమా ద్వారా వీళ్లందరి కుటుంబాలకు భరోసా కలుగుతుంది. ఇక రాష్ట్రం మొత్తం అనేక మందికి ధీమా దొరుకుతది. ఇప్పటికే బతుకమ్మ చీరల తయారీతో నేతన్న బతుకులకు ఆర్థిక భరోసా కల్పించిన సీఎం కేసీఆర్ నేతన్న బీమాతో మరో అడుగు ముందుకు వేసి మాకు మరింత ధైర్యం ఇచ్చిన్రు. మా ఊరి కార్మికుల పక్షాన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం.
– అలువాల విఠోబా, వస్త్రవ్యాపార సంఘం
అధ్యక్షుడు, గర్శకుర్తి(గంగాధర)
మా గురించి ఆలోచించిన మొదటి సీఎం
దాదాపు 20 ఏండ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న. ఇన్నేండ్లలో ప్రభుత్వాలు మారినయ్.. పాలకులు మారినయ్.. ఎవ్వరు వచ్చినా చేనేత రంగం గురించి కానీ, నేత కార్మికుల స్థితిగతుల గురించి ఆలోచన చేసిన వారు లేరు. ఎంతమంది పాలకులు వచ్చినా మా బతుకులు ఇంతే, ఇక మారవనుకున్న. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో మొదటిసారిగా నేత కార్మికుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన తీసుకువచ్చిన గొప్ప పథకం నేతన్న బీమా. ముమ్మాటికీ ఆయనే మాకు నాయకుడు.
– అలువాల తిరుపతి, బతుకమ్మ చీరల ఉత్పత్తిదారుడు, గర్శకుర్తి(గంగాధర)
బీమాతో ధీమాగా బతుకుతం
నా భర్త రాజమౌళి కొన్నేండ్ల కిందట చనిపోయిండు. నేను 15 ఏండ్ల నుంచి చేనేత సంఘంల కండెలు చుట్టుకుంట జీవనం పొందుతున్న. ఒక అబ్బాయిని సాదుకుంటున్న. మున్ముందు నాకు చేతగాకపోతే అబ్బాయి ఎట్ల బతుకుతడోనని ఆందోళన పడ్డ. ఇప్పుడు సర్కారు నేతన్న బీమా తెచ్చినంక ధీమాగా బతుకుతం అన్న ఆశ కలుగుతంది. మాటకు కట్టుబడి రూపాయి ఖర్చు లేకుండా మా తరఫున సర్కారే మొత్తం పైసలు కట్టి బీమా చేయించి, మేం అడగకుండనే ఆదుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటం.
– జెల్లా స్వరూప, వితంతు, చేనేత అనుబంధ కార్మికురాలు, బోర్నపల్లి, హుజురాబాద్
(హుజూరాబాద్టౌన్)
నేతన్నలకు గొప్ప వరం
నేను ఎనిమిదేండ్ల నుంచి చేనేత సంఘంల నేత కార్మికుడిగా పనిచేస్తున్న. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నరు. వారిని సాదుకోవడమే కష్టంగా ఉన్న ఇప్పటి పరిస్థితిల బీమా చేయించుకునుడు కానిపని. కానీ, రాష్ట్ర సర్కారు మేం ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండనే రూ.5 లక్షల బీమా చేయించడం గొప్ప వరంగా భావిస్తున్న. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉంది.
– బింగి సహదేవ్, చేనేత కార్మికుడు, కాకతీయకాలనీ,
హుజురాబాద్ (హుజూరాబాద్టౌన్)
మా ఇంటికి ధీమా వచ్చింది
తెలంగాణ సర్కారు ఇస్తున్న ఉపాధితో మా బతుకులకు భరోసా కలిగింది. గతంల భీవండిలో పనిచేసినా నెలకు రూ.పది వేలకు మించి కూలీ రాలే. ఇప్పుడు నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్న. త్రిప్టు పథకం ద్వారా పొదుపు చేసుకుంట నాలుగు పైసలు వెనుకేసుకొచ్చినం. ఇప్పుడు మాకు కేటీఆర్ సార్ బీమా కల్పిస్తున్నాడన్న వార్త మా కుటుంబానికి ధీమా వచ్చినట్టయింది.
– అడిశెర్ల రాజు, వార్పిన్ కార్మికుడు, సిరిసిల్ల
కేటీఆర్ సార్ ఉన్నారన్న ధైర్యంతోనే..
ఇరవై ఏళ్ల నుంచి సాంచాల మీద పనిచేస్తున్న. బతుకు దెరువు కోసం భీవండి, సోలాపూర్కు పోయి వచ్చిన. ఇక్కడిలెక్క అక్కడి సర్కారు కామ్గార్లను ఏమీ పట్టించుకోదు. ఇక్కడి సర్కారు ఇస్తున్న పథకాలను చూసి కొన్నేండ్ల కింద వచ్చిన. బతుకమ్మ చీరలతో మంచిగ పనైతుంది. బీమా కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మాకు కేటీఆర్ సార్ అండగా ఉన్నారన్న ధైర్యంతోనే పని చేస్తున్నం.
– సామల శ్రీనివాస్, మరమగ్గాల కార్మికుడు, పరకాల (ములుగు జిల్లా)
ఇన్నేళ్ల చరిత్రంలో ఎవరూ చేయలే..
ఇన్నేళ్ల చరిత్రలో నేతన్న కుటుంబ సంక్షేమం కోసం ఆలోచించిన ప్రభుత్వాలు లేవు. బతుకమ్మ చీరలతో బతుకులకు భరోసా కల్పించడమే కాదు, రూ.5 లక్షల బీమాతో ధీమా ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దిక్కయ్యిండు. ఇదంతా మంత్రి కేటీఆర్ చొరవతోనే. ఆయనకు సిరిసిల్ల నేతన్నలు ఎప్పుడూ రుణపడి ఉంటరు.
– బూట్ల మోహన్, మరమగ్గాల ఆసామి, సిరిసిల్ల