కరీంనగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. గ్యారెంటీ పథకాలకు అరకొర కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. రుణమాఫీకి అసలే కేటాయించకపోవడంపై మండిపడ్డారు. ఇది పేదలకు ఏమాత్రం కూడా ఉపయోగపడదని స్పష్టం చేస్తున్నారు. రైతులను పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు.
అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతోపాటు ఇచ్చిన అనేక హామీలను నిలబెట్టుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలు కోసం బడ్జెట్లో తగు విధంగా నిధులు కేటాయించ లేదు. శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను చూస్తే ఎన్నికల హామీలు నీటి మూటలేనని నిరూపితమైంది. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, యువతకు కేటాయింపులు నామమాత్రమే. తొలి బడ్జెట్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావని చెప్పకనే చెప్పారు..
– పీ సుగుణాకర్ రావు, బీజేపీ సీనియర్ నాయకుడు
రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేసింది. అదే కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరించింది. ఈ రెండు ప్రభుత్వాలకు తేడా ఏమిటో ప్రజలకు ఆదిలోనే అర్థమవుతోంది.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే