వెల్గటూర్, డిసెంబర్ 17 : సీఎం కేసీఆర్ సర్వ మతాలను సమానంగా గౌరవిస్తూ, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శనివారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఎస్ఆర్ గార్డెన్లో నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిఫ్ట్ ప్యాక్లను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరెలు, రంజాన్ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు ఇవ్వడం గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. రాష్ట్రంలోని క్రైస్తవులకు రాష్ట్రం తరఫున ఈ నెల 21న హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఇస్తున్న విందుకు హాజరు కావాలని కోరారు. అనంతరం పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, జడ్పీటీసీ సుధారాణి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పొనుగోటి శ్రీనివాసరావు, నాయకులు రాజేందర్, సర్పంచ్ గెల్లు శేఖర్, జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.