చండూరు, జూలై 22 : రెవెన్యూ కార్యాలయంలో ఆన్లైన్ రికార్డులు మాయమైన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండూర్ తాసీల్దార్ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ రికార్డు మాయమయ్యాయి. రికార్డు true copy గతంలో మీసేవ కేంద్రాల ద్వారా ఇచ్చేవారు. అవసరం ఉన్నవారు మీసేవ కేంద్రాల్లో తీసుకునేవారు. ఇప్పుడు మీ సేవ కేంద్రాలలో రాకపోవడంతో తాసీల్దార్ కార్యాలయంలో తీసుకోవడానికి వెళ్లగా భూ భారతి ఆపరేటర్ 2023కు సంబందించిన ఆన్లైన్ రికార్డులు అందుబాటులో లేవని చెప్పడంతో, సదరు రైతులు అధికారులను సంప్రదించగా అధికారులు “సిస్టమ్ ఫార్మాట్ అయింది” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. అయితే ప్రజల భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులు కేవలం ఒక సిస్టమ్ ఫార్మాట్ కారణంగా అందుబాటులో లేకుండా పోతాయా? అలాంటి కీలకమైన సమాచారానికి బ్యాకప్ వ్యవస్థ లేదా? డిజిటల్ రికార్డుల భద్రత కోసం తీసుకున్న చర్యలు ఏమిటి? అని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తి హక్కులకు సంబంధించిన రికార్డుల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలన్నారు. ఈ విషయంలో ప్రజలు అయోమయానికి లోనుకాకుండా చండూరు తాసీల్దార్ ఈ అంశంపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణలో ఏదైనా నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రికార్డులపై ప్రజల నమ్మకాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు అవసరమయ్యే రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు కలవర పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.