రాయికల్, మార్చి 28: గంజాయి ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు రాయికల్లో పట్టుబడ్డారు. వీరిలో పదహారండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాయికల్ ఠాణాలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. జగిత్యాలకు చెందిన కొండూరి రాజేశ్, ఆరుముళ్ల సాయికుమార్, రాయికల్కు చెందిన పెనుగొండ గణేశ్, మలవాత్ సతీశ్ ముఠాగా ఏర్పడి పట్టణానికి చెందిన ఓ పదహారేండ్ల బాలుడి వద్ద గంజాయిని కొనుగోలు చేసి జగిత్యాలలో యువతకు విక్రయిస్తున్నారు.
వీరు గంజాయి, చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో కొండూరి రాజేశ్, ఆరుముళ్ల సాయికుమార్, బాలుడితో కలిసి 1.5 కిలోల గంజాయితో గురువారం బైక్పై రాయికల్కు బయల్దేరారు. ముందస్తు సమాచారం మేరకు జగిత్యాల రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, రాయికల్ ఎస్ఐ అజయ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సీఐ, రాయికల్ ఎస్ఐ కానిస్టేబుళ్లు సాగర్, ప్రశాంత్ను జిల్లా ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.