కరీంనగర్ రూరల్, మార్చి 30: ‘అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న రాష్ర్టాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నయి. ఎందుకింత కండ్ల మంట..? ఇక్కడి ప్రజలు బాగుపడవద్దా..? తెలంగాణ అంటే ఎందుకింత అక్కసు..? ఎప్పుడూ ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నయి. రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు, అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్నయి’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్ మండలం చామనపల్లి అప్పన చెరువు కట్టపై బీట్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలకు కోట్లాది నిధులతోపాటు గ్రామాలకు ఇంటర్నల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సమైక్య పాలనలో గ్రామాలు అంధకారంలో మగ్గేవని, అభివృద్ధికి దూరంగా ఎక్కడో విసిరేసినట్లు ఉండేవన్నారు. నీటికి, విద్యుత్, పంటల సాగు, ధాన్యం కొనుగోలుకు అనేక ఇబ్బందులుండే వని, ఎరువులు, కరెంట్ కోసం లాఠీ దెబ్బలు తిన్న రోజులు ఎన్నో ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. దశాబ్దాల సమస్యలు దూరం చేసుకుని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కరీంనగర్లోని గ్రామీణ రోడ్లను మహర్దశ పట్టిందని, అన్ని లింక్ రోడ్లు నిర్మించుకున్నామని చెప్పారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన బాధితులకు ఎకరాకు రూ.10వేలు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మండలంలోని నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. దేశంలో ఏ ము ఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. కేంద్రం నిర్వాకంతో దేశంలో వరిధాన్యాన్ని అక్కడి ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, కానీ తెలంగాణలో రైతు పండించిన ప్రతి గింజా కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని వివరించారు. దళిత బంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పనకు గ్రామాల్లో పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 3వేల మందికి ఉపాధి కల్పిస్తామని వివరించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే, మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కేసీఆర్ను దీవించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు మళ్లీ పాదయాత్రలతో మన మధ్యకు వస్తున్నారని, వారిని నమ్మితే తెలంగాణ మళ్లీ చీకట్లోకి వెళ్తుందని తస్మాత్ జాగ్రత్త..అని సూచించారు. ఇక్కడ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్లు బోగొండ లక్ష్మి, దుర్గ, భూమయ్య, ఎంపీటీపీలు బుర్ర తిరుపతి గౌడ్, దుర్శేడ్, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్లు గోనే నర్సయ్య, పెం డ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, కార్పొరేటర్ రాజేందర్, బోగొండ ఐలయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్రావు, చల్ల లింగారెడ్డి, కట్ల గౌతం రెడ్డి, లక్ష్మారెడ్డి, గంట శంకరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చలమయ్య, పబ్బతి రంగారెడ్డి, ఎల్కపల్లి చంద్రమోహన్, కొమురయ్య, అంజనేయులు, రమణయ్య, అజయ్, సాయికృష్ణ, తదితరులు ఉన్నారు.