కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 5 : తెలంగాణను ఎడారిగా మార్చేందుకే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. గోదారి నీళ్లన్నీ ఆంధ్రకు తరలించుకునే పోయే కుట్రలో భాగంగానే ఈ డ్రామా సాగుతున్నదని ధ్వజమెత్తారు. మంగళవారం ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు’ ‘కమిషన్ వక్రీకరణలు- వాస్తవాలు’ అంశంపై హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీశ్రావు ఇచ్చిన ప్రజంటేషన్ను కరీంనగర్ చింతకుంటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గంగుల వీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హరీశ్రావు ఇచ్చిన ప్రజంటేషన్తో కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఖుల్లం ఖుల్లంగా ప్రజలకు అర్థమైందన్నారు. ‘ప్రభుత్వం మాదే కదా అని కమిటీలు ఏ రిపోర్టు ఇచ్చినా మార్చుకోవచ్చు. ప్రభుత్వంగా మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు’ అని కొన్ని పేపర్లకు లీకులు ఇచ్చి కథనాలు రాపిస్తున్నారని విమర్శించారు. అది ఇప్పుడు సాగుతున్న కుట్ర కాదని, అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు నుంచే సాగుతున్న కుట్ర అని విమర్శించారు.
ఆనాడు రాష్ట్రం రాకుండా ఏవైతే కుట్రలు జరిగాయో..? ఇప్పుడు మళ్లీ అదే కుట్రలు మొదలయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ సమాజం కేసీఆర్ను నమ్మిందని, కేసీఆర్ వెంట ఉండి పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ నాయకులు ఎస్సారెస్పీ తర్వాత గోదావరిపై ఎక్కడైనా ఒక్క ఆనకట్టనైనా కట్టారా..? చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కడితే ఆంధ్రకు నీళ్లు రావన్న కుట్రతో తెలంగాణను ఎండబెట్టారని, ప్రజలు కరువుతో అల్లాడినా, వలసలు పోయినా చోద్యం చూశారన్నారు. 1963 తర్వాత గోదావరిపై తొలిసారి ఆనకట్ట కట్టింది కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడం, అక్కడ 152 మీటర్ల ఎత్తులో కట్టేందుకు తాము అనుమతి ఇవ్వబోమని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతోనే మేడిగడ్డ వద్ద బరాజ్ కట్టాల్సి వచ్చిందన్నారు. మేడిగడ్డ కట్టిన తర్వాత సుందిళ్ల, అన్నారం మీదుగా మధ్యమానేరు నుంచి ఎల్ఎండీ వరకు ఏడాది పొడవునా జలాలతో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. ‘తెలంగాణను ఎండబెట్టాలె.. ఆంధ్రకు నీళ్లివ్వాలె’ అన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రెండు పిల్లర్లు కుంగిపోగానే నేరుగా ఆంధ్రకు గోదావరిని తరలించే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఇరవై నెలలుగా మధ్యమానేరు, ఎల్ఎండీ, ఎల్లంపల్లి జలాశయాలు నీరు లేక ఏడారిగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గోదావరి నీళ్లు కిందికి పోతున్నాయని, చంద్రబాబు బనకచర్ల ప్రారంభించి మొత్తం నీటిని ఎత్తుకపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కన్నెపల్లి వద్ద ఎలాంటి కట్టడాలు కూలిపోలేదని, అక్కడ మోటర్లు ఆన్ చేసే నీళ్లు వస్తాయని, ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. కన్నెపల్లి ఆన్ చేస్తే, మేడిగడ్డ మరమ్మతులు చేయిస్తే మళ్లీ ఆంధ్రకు నీళ్లు రాకుండా పోతాయనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఇలాంటి కరువు పరిస్థితులను కొనసాగించి, తెలంగాణ వెనుకబాటుతనాన్ని చూపి మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రాజెక్టు కట్టి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడం కేసీఆర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రజలందరూ కేసీఆర్ వెంటే ఉంటారని, ఇక కాంగ్రెసోళ్ల ఆటలు సాగవని తేల్చిచెప్పారు. మీరు ఏం చేస్తారో చెసుకోవచ్చునని, ఏమైనా చర్యలు తీసుకుంటే తెలంగాణ భగ్గుమంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు పారిపోయే పరిస్థితి వస్తుందన్నారు. అసెంబ్లీలో ఘోష్ ఇచ్చిన నివేదికను, కాంగ్రెస్ కుట్రను ప్రజల ముందు పెడుతామన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణకు నీళ్లు వస్తాయని, అప్పటి దాకా ఈ కుట్రలు సాగుతూనే ఉంటాయన్నారు. ఆయన వెంట జడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, సాగర్, నాయకులు సుంకిశాల సంపత్రావు, శ్యాంసుందర్రెడ్డి, మైకెల్ శ్రీను, రమ ఉన్నారు.