కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 8 : విఘ్నేశ్వరుడి వీడ్కోలుకు వేళయింది. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేసేందుకు ఊరూరూ సిద్ధమైంది. కరీంనగర్లోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొత్తపల్లి, మానకొండూర్ చెరువులతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్ వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారీ లైటింగ్ అమర్చడంతో పాటు, పెద్ద క్రేన్స్ను వినియోగిస్తున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.