హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణం పెంచడం, చకెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. చెరుకు సాగు, దాని ఉత్పత్తుల పెంపుపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 12 చకెర కర్మాగారాలు ఉండగా, ప్రస్తుతం 7 కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఆ పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ఏటా సుమారు 50 లక్షల టన్నుల చెరుకు అవసరమవుతుందని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు. చెరుకు సాగు పెంచేందుకు, పరిశ్రమలకు అవసరమైన ముడి చెరుకు లభ్యతను మెరుగుపరచేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ చెరుకు రైతులకు కూడా వరి రైతులకు అందిస్తున్న తరహాలో టన్నుకు రూ.500 ప్రోత్సాహకం అందించాలని కోరారు.