ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చే వారి ఆకలి తీరుస్తున్నది అన్నపూర్ణ పథకం. బల్దియా, అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ పథకం నిర్వహిస్తుండగా, ఏడాదిగా ఆర్జీదారులందరికీ ఉచిత భోజనం పెడుతూ కడుపు నింపుతున్నది. పొద్దంతా ఉండి సమస్యలు చెప్పుకొని ఖాళీ కడుపుతో ఇంటికెళ్లకుండా రుచికరమైన భోజనం పెట్టి సాగనంపుతున్నది. తాజా కూరలు, చట్నీ స్వీటు.. ఇలా అన్ని రకాలతో ఇంటిని తలపించేలా వడ్డిస్తూ అందరి మన్ననలు పొందుతున్నది.
– కలెక్టరేట్, ఏప్రిల్ 3
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి పోయే వారి ఆకలి తీరుస్తున్నది ‘అన్నపూర్ణ’ పథకం. బల్దియా, అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ సంయుక్తాధ్వర్యంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతున్నది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కర్ణన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రజావాణి నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలే అధికంగా వస్తుంటారు. మారుమూల ప్రాంతాల్లోని వారంతా వేకువజామునే బయలుదేరి పది గంటల వరకు కలెక్టరేట్కు చేరుకుంటారు. జిల్లా కేంద్రానికి వచ్చే సందర్భంలో తమ వెంట అన్నపానీయాలు తెచ్చుకోవడం కూడా అరుదు.
కలెక్టరేట్లో అధికారులను కలిసి, తమ గోడు వెళ్లబోసుకొని, దరఖాస్తులు స్వీకరించే వరకు ఆలస్యం అవుతుంది. వీరంతా ఉదయం అల్పాహారమో, భోజనమో చేసి వచ్చినా మధ్యాహ్నం మాత్రం కడుపుమాడ్చుకోవాల్సిందే. హోటళ్లలో తినేందుకు కూడా కొంతమంది డబ్బుల్లేని పరిస్థితిలో ఉండడం సర్వసాధారణం. అలాంటి వారి కోసం బల్దియా, హరేకృష్ణ మూవ్మెంట్ చారిటేబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. సుమారు 150 మందికి పైగా అర్జీదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్ ప్రధాన ద్వారం సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చే ప్రతి పది మందిలో నలుగురు ఉచిత భోజనం చేసిన అనంతరం హరేకృష్ణ ఫౌండేషన్, బల్ధియా దాతృత్వాన్ని కొనియాడుతూ, తమ తమ గ్రామాలకు తిరుగుపయనమవుతున్నారు. కాగా, ఒక్కో భోజనానికి రూ.25వరకు ఖర్చవుతుండగా, ఈ మొత్తం నగర పాలక సంస్థనే భరిస్తున్నది.
హోటళ్ల తినే ఖర్చు తప్పుతుంది
మాది హుజురాబాద్ మండలం చెల్పూర్. నేను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన. ఇంటి వద్ద భోజనం చేసి వచ్చినా, పని పూర్తయ్యే సరికి మధ్యాహ్నం అయింది. అప్పుడే ఆకలైంది. హోటళ్ల తినాలంటే వంద రూపాయల పైనే అయితది. బస్సు చార్జీలు, ఇతర ఖర్చులు తడిసి మోపడైనయి. ఏం తింటాం. ఉచిత భోజనం ఏర్పాటుతో ప్రజావాణి కోసం వచ్చే వారికి హోటళ్లలో తినే ఖర్చు తప్పుతుంది. నిజంగా ఇది గొప్ప పని. మునిసిపాలిటీ పాలకవర్గానికి కృతజ్ఞతలు.
– మల్లేశం, చెల్పూర్
మా ఆకలి తీరుస్తున్నది
మాది హుజురాబాద్ దగ్గర చింతలపల్లి. నా సమస్య పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చిన. గేటు పక్కనే భోజనం వడ్డిస్తుండడం చూసి నేను కూడా తిన్న. భోజనం బాగుంది. మాలాంటి వారి కోసం భోజనం పెట్టడం గొప్ప పని. ఇంటిలో భోజనం చేసినట్లుగా నాణ్యతతో కూడిన వంటకాలతో వడ్డిస్తున్నారు.
– బీ రాజయ్య, చింతలపల్లి
మాలాంటోళ్లకు మేలు
అధికారుల కోసం హడావిడిగా వచ్చిపోయే మాలాంటి వారి ఆకలి తీరుస్తున్నరు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు బాక్స్ తెచ్చుకోలేక, ఆకలేస్తుంటే బయటకెళ్లి తినలేక ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భాల్లో మున్సిపల్ యంత్రాంగం ఉచితంగా భోజన వసతి కల్పించడం మాలాంటోళ్లకు ఎంతో మేలు చేస్తది.
– వీ రాములు, మొగ్దుంపూర్