సక్సెస్ ఫుల్గా ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఉచిత శిక్షణ
400 మంది గ్రూప్-1, 700 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్
గ్రూప్-1కు 90, కానిస్టేబుల్కు 60 రోజుల పాటు తరగతులు
లక్ష్య, వికాస్ అకాడమీతో ఒప్పందం
తెలుగు, ఇంగ్లిష్లో స్టడీ మెటీరియల్ పంపిణీ
ఇప్పటికే 50 రోజుల శిక్షణ పూర్తి
పేదల కల నెరవేర్చేందుకే : ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహలత
ఉద్యోగార్థుల కల సాకారానికి రాష్ట్ర సర్కారు జంబో నోటిఫికేషన్లు ఇస్తుండగా, ధర్మపురి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ అండగా నిలుస్తున్నది. 400 మంది గ్రూప్-1, 700 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నది. లక్ష్య, వికాస్ అకాడమీతో ఒప్పందం చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం తర్ఫీదు ఇవ్వడమే కాదు.. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో స్టడీ మెటీరియల్ను పంపిణీ చేస్తున్నది. ఇంకా ఫ్రీగా భోజనం పెడుతుండగా, ఇప్పటికే 50 రోజుల శిక్షణ పూర్తయింది. ముగింపునకు మరో పది రోజులు ఉండగా, యువత సీరియస్గా ప్రిపరేషన్లో నిమగ్నమైంది.
జగిత్యాల, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగార్థుల కల సాకారానికి రాష్ట్ర సర్కారు జంబో నోటిఫికేషన్లు వేస్తుండగా, ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థులకు ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ అండగా నిలుస్తున్నది. 400 మంది గ్రూప్-1, 700 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నది. లక్ష్య, వికాస్ అకాడమీతో ఒప్పందం చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం తర్ఫీదు ఇవ్వడమే కాదు.. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసింది. ఇంకా ఫ్రీగా భోజనం పెడుతుండగా, ఇప్పటికే 50 రోజుల శిక్షణ పూర్తయింది. ముగింపునకు మరో పది రోజులు ఉండగా, యువత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నది.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా రాష్ర్టాన్ని సాధించి, అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల వ్యవధిలోనే అద్భుతాలు సృష్టించింది. నీళ్లు, నిధుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా మరో 80వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం, దానికి అనుగుణంగా గ్రూప్-1, పోలీస్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలోని ఉద్యోగార్థులంతా కోచింగ్ సెంటర్లను ఆశ్రయించారు. హైదరాబాద్, వరంగల్ లాంటి మహానగరాల్లోని సెంటర్లకు బారులు తీరారు. అయితే గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కోచింగ్ సెంటర్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలని భావించగా, ఎల్ఎం కొప్పుల ట్రస్టు ముందుకు వచ్చింది. ధర్మపురి పట్టణం వేదికగా ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణతో పాటు, మధ్యాహ్న భోజనం, ప్రింటెడ్నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నది.
గ్రూప్-1 ఉద్యోగార్థులకు 90 రోజుల శిక్షణ
గ్రూప్-1తో పాటు, ఇతర గ్రూప్ పోస్టులకు సన్నద్ధమయ్యే వారి కోసం ధర్మపురి పట్టణంలోని షాదీఖానలో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 500 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. గ్రూప్-1 కోసం సన్నద్ధమయ్యే ఉద్యోగార్థుల కోసం ఎల్ఎం కొప్పుల ట్రస్టు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన వికాస్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకున్నది. 90 రోజుల పాటు విద్యార్థులకు గ్రూప్-1 నాలుగు పేపర్లకు సంబంధించిన సిలబస్ను వికాస్ అకాడమీ బోధిస్తున్నది. ఉదయం 9.30 గంటలకు తరగతులు ప్రారంభించి సాయంత్రం 5.30 గంటల దాకా నిర్వహిస్తున్నది. కాగా, వికాస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్-1 సిలబస్కు చెందిన నోట్స్ మొత్తాన్ని 12 పుస్తకాల రూపంలో అచ్చువేసి కొప్పుల ట్రస్టు ఉద్యోగార్థులకు ఉచితంగా అందజేస్తున్నది. ఇంకా ఉద్యోగార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం ఎల్.ఎం ట్రస్టు ఉచితంగా అందజేస్తున్నది. కోచింగ్ ఇచ్చే ట్యూటర్లకు సైతం భోజన వసతిని కల్పిస్తున్నది.
కానిస్టేబుల్స్ అభ్యర్థులకు 60 రోజుల శిక్షణ..
కానిస్టేబుల్ పోస్టులకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థుల కోసం మరో శిక్షణ శిబిరాన్ని ధర్మపురిలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. 700 మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు. కానిస్టేబుల్ పోస్టులకు శిక్షణ కోసం లక్ష్య అకాడమీతో ట్రస్టు ఒప్పందం కుదుర్చుకుంది. 60 రోజుల వ్యవధిలో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన సిలబస్ను లక్ష్య అకాడమీ వారు ఉద్యోగార్థులకు బోధిస్తున్నారు. ఇక లక్ష్య అకాడమీకి సంబంధించిన నోట్స్ను ఎల్. ఎం ట్రస్టు ఆధ్వర్యంలో 11 పుస్తకాల రూపంలో అచ్చువేసి విద్యార్థులకు అందజేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు సైతం మధ్యాహ్నం ఉచితంగా బోధన సౌకర్యం కల్పిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిలబస్ బోధనను చేపడుతున్నారు. 5 నుంచి 7 గంటల వరకు ఫిజికల్ ఫిట్నెస్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఇద్దరు పీఈటీలను ప్రత్యేకంగా నియమించారు.
కానిస్టేబుల్ కోచింగ్కు హాజరైన అభ్యర్థులు
భోజనం చేస్తున్న అభ్యర్థులు
ట్రస్టుకు ధన్యవాదాలు..
ధర్మపురి నియోజకవర్గ నిరుద్యోగుల కోసం మంత్రి ఈశ్వర్ ప్రత్యేక చొరవ చూపి ఉచిత కోచింగ్ ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీ కోచింగ్ ఇస్తున్నారు. ఉచిత స్టడీ మెటీరియల్తో పాటు మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయకపోతే హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సివచ్చేది. ప్రైవేటుకు వెళ్తే ఒక్కొక్కరికీ రూ.30వేల నుంచి రూ.50వేల దాకా ఖర్చు అయ్యేది. ధర్మపురి కేంద్రంగా నిరుపేదల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన మంత్రి ఈశ్వర్ సారుకు, ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ స్నేహలత మేడమ్కు హృదయపూర్వక ధన్యవాదాలు. – కలమడుగు హరిప్రసాద్, ఎమ్మెస్సీ, బీఎడ్, రామయ్యపల్లి (ధర్మపురి)
హైదరాబాద్ కంటే ఇక్కడే శిక్షణ బాగున్నది
2017-18లో పోలీస్ జాబ్స్కు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న. అక్కడే ఓ ఇనిస్టిట్యూట్లో డబ్బులు కట్టి కోచింగ్ తీసుకున్న. కానీ, అప్పుడు ఉద్యోగం సాధించలేక పోయిన. ఇప్పుడు ధర్మపురిలో ఎల్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ తీసుకుంటున్న. హైదరాబాద్ కంటే ఇక్కడే శిక్షణ బాగున్నది. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నరు. అంతే కాకుండా, ఉచిత భోజన వసతి కల్పించిన్రు. ఇది దూరప్రాంతాల నుంచి వచ్చే మాలాంటి వారికెంతో ఉపయోగం. మంత్రి ఈశ్వర్ సార్కు ధన్యవాదాలు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని కచ్చితంగా ఎస్ఐ ఉద్యోగం సాధిస్త.
– సంగ శ్రీధర్, ఎంబీఏ, ముత్తునూర్ (వెల్గటూర్ మండలం)
దూర భారం తప్పింది..
నేను గతేడాది డిగ్రీ పూర్తి చేశా. పీజీ చేద్దామని నిర్ణయించుకున్నా. ఇంతలోనే ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగం సాధించాలంటే కోచింగ్ తీసుకుందామని అనుకుంటున్న సమయంలో ధర్మపురిలో ఉచిత కోచింగ్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో మంచి అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో శిక్షణనిస్తున్నారు. స్టడీ మెటీరియల్ అందజేశారు. ఉచిత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఉద్యోగం సాధించేందుకు ఇంతకంటే ఏం కావాలి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మంత్రి ఈశ్వర్ సారుకు, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహలత మేడమ్కు ధన్యవాదాలు..
– బద్ది యమున, బీఏ, బట్టపెల్లి పోతారం (సారంగాపూర్)
స్థానికంగా కోచింగ్ ఇవ్వడం గొప్ప విషయం..
మాది పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లి. గ్రూప్స్కు ప్రిపేరవుతున్నా. స్థానికంగా కోచింగ్ తీసుకోవాలని అనుకున్నా స్థానికంగా సెంటర్లు లేక చాలా ఇబ్బందిపడ్డా. కానీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన. ధర్మపురిలో బంధువుల ఇంట్లో ఉంటున్న. నేను నా రెండేళ్ల బాబును తీసుకొని ప్రతి రోజూ సెంటర్కు వచ్చి శిక్షణ తీసుకుంటున్న. అనుభవజ్ఞులైన అధ్యాపకులు చక్కగా బోధిస్తున్నరు. మా బాబు ఏడిస్తే కాసేపు ఎత్తుకొని ఆడిస్తున్నా. ఉద్యోగాలు ప్రకటించి, కోచింగ్ కోసం ఇంత మంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ సారుకు, మంత్రి ఈశ్వర్ సారుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
– జాడి రమాదేవి, ఎంఏ, వెన్నంపల్లి (కాల్వశ్రీరాంపూర్ మండలం)
శిక్షణ పొందుతూనే సేవలందిస్తున్నాం..
నేను టీఆర్ఎస్ యూత్ విభాగం నాయకుడిని. గ్రూ ప్స్ కోచింగ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు చూస్తు న్నా. నేను కూడా ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నా. ఓ వైపు తరగతులు వింటూనే తోటి అభ్యర్థులకు ఇబ్బందులు కలుగుకుండా సేవలందిస్తున్నా. అనుభవజ్ఞులై న అధ్యాపకులతో శిక్షణ ఇప్పించడంతోపాటు మధ్యాహ్నభోజన సౌకర్యం, ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశాం. ధర్మపురిలో ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మంత్రి ఈశ్వర్ సారుకు, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహలత మేడమ్కు ధన్యవాదాలు.
– అవునూరి శ్రీకాంత్, నిర్వహణ బాధ్యుడు
ఉద్యోగార్థులకు సదవకాశం..
మంత్రి ఈశ్వర్, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఆద్వర్యం లో ధర్మపురిలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు మంచి స్పందన ఉంది. ఉద్యోగం సాధించాలనే తపన కలిగిన వారికి ఇదొక సదవకాశం. హైదరాబాద్లో పేరుగాంచిన స్టడీ సెంటర్లకు దీటుగా ధర్మపురిలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాలకు వెళ్తే ఒక్కొక్కరికి రూ. 40వేల నుంచి రూ.50వేల దాకా ఖర్చవుతుంది. ఇక్కడ ఉచితంగా శిక్షణనివ్వడంతో పాటు ఉచిత స్టడీ మెటీరియల్, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మంత్రి ఈశ్వర్కు ఉద్యోగార్థుల తరపున ధన్యవాదాలు.
– వై శ్రీనివాసులు, గ్రూప్స్ ఇన్స్ట్రక్టర్
గ్రామీణ ప్రాంత యువత మేలు కోసమే..
ఉద్యోగం, ఉపాధి అనేవి మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత యువతకు ఏనాడూ సరైన సంఖ్యలో ఉద్యోగాలు లభించలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సింహభాగాన్ని సీమాంధ్రవారికే దక్కేవి. ఈ ప్రాంత యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం సిద్ధించి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో పెద్ద సంఖ్యలో కొలువుల భర్తీ జరుగుతున్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఇటీవలే 80వేల సర్కారు కొలువులను భర్తీ చేస్తామని ప్రకటించడం, గ్రూప్-1, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడం జరిగిపోయాయి. పట్టణ ప్రాంతంలోని వారు తమకు అందుబాటులో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. కానీ, గ్రామీణ ప్రాంత యువతకు ఆ సదుపాయం లేకపోవడంతో శిక్షణ ఇప్పించాలని అనుకున్నాం. ఈ బాధ్యతను ఎల్.ఎం కొప్పుల ట్రస్టు స్వీకరించింది. ధర్మపురి కేంద్రంగా రెండు కోచింగ్ సెంటర్లు పెట్టి 45 రోజులుగా శిక్షణ అందిస్తున్నాం. ట్రస్టు నిర్వహకులకు ధన్యవాదాలు.
– కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి
కొందరికి ఉద్యోగాలు వచ్చినా ఆనందమే..
ప్రభుత్వ ఉద్యోగం అనేది యువత కల. సర్కా రు కొలువు సంపాదిస్తే, జీవితంలో పూర్తిగా స్థిరపడినట్లే. అయితే గవర్నమెంట్ జాబ్స్ విషయంలో మన తెలంగాణ ప్రాంత విద్యార్థులకు గతంలో అన్యాయం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తదుపరి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంత వాసులు వేలకువేలు ఖర్చుచేసి ప్రధాన నగరాల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంత నిరుపేద యువత ఖరీదైన కోచింగ్ను తీసుకునే స్థాయిలో లేరన్న విషయం అవతగతమైంది. ఈవిషయాన్ని గుర్తించాం. అందుకే గ్రామీణ ప్రాంతంలో ప్రముఖ అకాడమీలతో బోధన చేయించాలని నిర్ణయించాం. రెండు సెంటర్లు ఏర్పాటు చేసి దాదాపు 1200 మందికి శిక్షణ ఇస్తున్నాం. ఉచితంగా భోజన వసతి కల్పించాం. ఇక్కడ కోచింగ్ తీసుకున్న వారిలో కొందరికి ఉద్యోగాలు వచ్చినా మా కృషి ఫలించినట్లే.
– స్నేహలత కొప్పుల, ఎల్ఎం కొప్పుల ట్రస్టు చైర్పర్సన్
శిక్షణ బాగున్నది..
సంక్షేమశాఖ, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మపురిలో గ్రూప్స్ ఫ్రీ కోచింగ్ బాగుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అద్భుతంగా శిక్షణ ఇస్తున్నరు. పట్టణాలకు వెళ్లలేని పేద విద్యార్థులు గృహిణులకు, యువతీ యువకులకు అన్ని సబ్జెక్టుల్లో కోచింగ్ ఇస్తున్నారు. ఇంకా ప్రతి అభ్యర్థికీ ఉచిత మెటీరియల్ అందజేశారు. సర్కార్ కొలువు సాధించడానికి సదవకాశాన్ని కల్పించిన మంత్రి ఈశ్వర్ సారుకు, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహలత మేడమ్కు ధన్యవాదాలు.
– రామగిరి నరేశ్, బీఎస్సీ, బీఎడ్ (ధర్మపురి)