ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర సర్కారు, మరో సరికొత్త ఆలోచన చేసింది. నిరుపేదల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల లోపానికి చెక్ పెట్టేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతేడాది నుంచే కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వగా, నేటి నుంచి రేషన్ షాపుల ద్వారా రాష్ట్రమంతటా పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
చొప్పదండి, ఏప్రిల్ 4: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పేద ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ముఖ్యంగా గ్రామీణ, పట్ట ణ ప్రాంత ప్రజలు, మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ సర్వేలో ఇదే విష యం వెల్లడైంది. 50శాతం మహిళలో రక్తహీనత, ఐదేండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం ఉన్న వారు 31 శాతం మంది, ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ఉపాయం చేసింది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే పైలె ట్ ప్రాజెక్టు కింద గతేడాది నుంచే కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో రైస్ను పం పిణీ చేసింది. ఆయా జిల్లాల్లోని గురుకులాలు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలకు కూడా బియ్యాన్నే పంపిణీ చేస్తుండగా, మంచి ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తం గా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే క్రమంలోఎక్కువగా పాలిష్ చేయడంతో నూక, తౌడు రూపంలో పోషకాలు వెల్లి పోతాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు శరీరానికి అందడం లేదు. ఈ నేపథ్యంలో గర్భిణుల్లో రక్తహీనత, చి న్నారుల్లో ఎదుగుదల లేకపోవడం, వయస్సుకు తగ్గ బరువు లేక పోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు చెక్పెట్టడంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ-12 కీలకమైన పోషకాలు. సాధారణ బియ్యం పిండికి ఈ మూడింటితో చేసిన మిశ్రమాన్ని కలిపి మళ్లీ వాటిని బియ్యం గింజల మాదిరిగా తయారు చేస్తారు. వీటిని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటారు. ఈ విధంగా తయారు చేసిన బియ్యం గింజలను సాధారణ బియ్యంలో కలిపేస్తారు. ప్రతి క్వింటాల్ సాధారణ బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను కలుపుతారు. ఇవి సాధారణ బియ్యంలో కలిసిపోతాయి. ఈ విధంగా ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కలిపిన బియ్యాన్నే బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అంటారు. సాధారణ బియ్యం మాదిరిగానే ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కూ డా ఉడుకుతాయి. సాధారణ బియ్యానికి ఉన్న రం గు, రుచి, వాసనే ఉంటుంది. త్వరగా పాడైపోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి కరీంనగర్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 2,78,411 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 2,62, 709 ఆహార భద్రతా కార్డులు (ఎఫ్ఎస్సీ), 15,664 అంత్యోదయ (ఏఎఫ్ఎస్సీ) కార్డులు, 24 అన్నపూర్ణ (ఏఏపీ) కార్డులు ఉన్నాయి. ఒక్కో యూనిట్కు 5 కిలోల చొప్పున ప్రతి నెలా 51,818 క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నారు.
ఐరన్ : ఎనీమియా(రక్తహీనత) నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో అలసట తగ్గిస్తుంది. చురుకుదనం, చలాకీతనం పెరుగుతుంది. నెలలు నిం డకుండా ప్రసవమవడం, బరువు తక్కువగా పుట్టడం వంటి ప్రసవ సంబంధిత, ఇతర సమస్యలు తలెత్తవు.
ఫోలిక్ యాసిడ్: శరీరంలో తగుమోతాదులో రక్తం తయారీకి సహాయపడుతుంది. గర్భస్త దశలో నరాల బలహీనత వల్ల పుట్టే బిడ్డల్లో, పుట్టుకతో వచ్చే రుగ్మతల నుంచి రక్షణ ఇస్తుంది.
విటమిన్ బీ-12: మెదడు, నాడీ వ్యవస్థను సక్రమంగా పని చేయించడంలో సహకరిస్తుంది. శరీరంలో రక్తం తయారు కావడానికి సహకరిస్తుంది. కిలో ఫోర్టిఫైడ్ రైస్లో 28 ఎంజీ-42.5 ఎంజీ ఐరన్, 75 – 125 మైక్రో గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్, 0.75 – 1.25 మైక్రో గ్రామ్స్ విటమిన్ బీ-12 ఉంటుంది. వీటికి అదనంగా జింక్, విటమిన్-ఏ, థయామిన్, రైబోప్లావిన్, నియాసిన్, విటమిన్ బీ-6 పోషకాలు కూడా కలుపుతారు. క్వింటాలు సాధారణ బియ్యానికి కిలో ఎఫ్ఆర్కే కలుపుతారు.
రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేటి నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం 2,78,411 తెల్ల రేషన్ కార్డులుండగా వీరందరికీ ప్రతి నెలా 51వేల818 క్వింటాళ్ల బలవర్ధక బియ్యం అందజేస్తున్నాం. ఇప్పటి నుంచి మాత్రం బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నాం. ఇప్పటికే దుకాణాల్లో సరుకును సిద్ధంగా ఉంచాం. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సరఫరా చేస్తున్నాం.
– సురేశ్రెడ్డి, డీసీఎస్వో (కరీంనగర్)
ఆరోగ్యంపై అవగాహన లేకపోవ డం, సరైన పోషకాలు గల ఆహారం లభిం చకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వినియో గదారులు, ముఖ్యంగా పేదలు రక్తహీనత బారినపడుతున్నారు. వారిని ఈ సమస్య నుంచి కాపాడేందుకు ప్రభుత్వం రేషన్లో సాధారణ బియ్యానికి బదులు బలవర్ధక బియ్యం పంపిణీ చేస్తుండడం అభినందనీయం. రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష.
– మహేశుని మల్లేశం, రేషన్ డీలర్ (చొప్పదండి)