కార్పొరేషన్, ఫిబ్రవరి 9: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తర్వాత పట్టణీకరణ వేగవంతమైందని, కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఒక గ్రోత్ సెంటర్గా మారిందని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్మాణ రంగానికి పుష్కలమైన వసతులు ఉన్నాయని, పక్కనే ఎల్ఎండీ రిజర్వాయర్ ఉందని, ఆపైన మిడ్ మానేరు కూడా ఉందని, భవిష్యత్లో నగరానికి నీటికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. రానున్న రోజుల్లో కరీంనగర్ మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రలోని రెవెన్యూ గార్డెన్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రాపర్టీ షోను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మేయర్ సునీల్రావుతో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. త్వరలోనే భారత్ చాలా గొప్ప దేశంగా మారబోతున్నదని, తాను పదేండ్లు ఎంపీగా పనిచేసిన అనుభవంతో ఈ మాట చెబుతున్నానని పేర్కొన్నారు. దేశంలో సగానికి పైగా ఉన్న యువత రానున్న రోజుల్లో తమ ఉద్యోగాలరీత్యా, ఇతర ఉపాధి అవకాశాల బాటలో ఆయా ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారని, ఈ క్రమంలో రియల్ రంగానికి భవిష్యత్తు అత్యధికంగా ఉంటుందన్నారు.
రియల్ వ్యాపారులందరూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాలమైన రోడ్లు, పార్కులు, ఇతర అన్ని సౌకర్యాలు ఉండేలా పక్కా ప్రణాళికలతో నూతన భవనాలు నిర్మించాలని, వెంచర్లు అలాగే ఉండాలని సూచించారు. అర్హత లేకున్నా కరీంనగర్కు కేసీఆర్ కృషితోనే స్మార్ట్సిటీని సాధించుకున్నామని, ఇప్పటి వరకు 560 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఉద్యమ సమయంలోనే మానకొండూరుకు నేరుగా బ్రిడ్జి ఉండాలని ఆలోచన చేశామని, దానికి అనుగుణంగానే ఎవరూ అడుగక ముందే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో కేబుల్ బ్రిడ్జి నిర్మించినట్లు చెప్పారు.
ఇంకా కరీంనగర్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు పింగళి రమేశ్, నమస్తే తెలంగాణ అడ్వటైజింగ్ జీఎం సురేందర్రావు, ఏజీఎం రాజిరెడ్డి, నమస్తే తెలంగాణ కరీంనగర్ బ్రాంచి మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్రావు, ఎడిషన్ ఇన్చార్జిలు ఐ సుభాష్, వీ సంపతి, యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, సర్క్యులేషన్ మేనేజర్ పురుషోత్తం, ప్రొడక్షన్ ఇన్చార్జి రాజిరెడ్డి, టెక్నికల్ ఇన్చార్జి రామకృష్ణ, స్టోర్ ఇన్చార్జి రవి, స్టాఫర్ దొంత వెంకటస్వామి, నమస్తే తెలంగాణ రిపోర్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే నివాసాల కొనుగోళ్లు, అమ్మకాలు, రియల్ వ్యాపారంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. ఈ పదేళ్ల కాలంలో అత్యధికంగా అభివృద్ధి సాధించింది. జిల్లాల పునర్విభజన అయినప్పటికీ అన్ని ప్రాంతాల్లోనూ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కేడీసీసీ నుంచి కూడా సుమారుగా 350 కోట్ల మేరకు నిర్మాణ రంగంలో రుణాలు ఇచ్చాం. నిర్మాణ రంగంలో ఉన్న అన్ని అవకాశాలను తెలుసుకునే విధంగా ప్రాపర్టీ షోలు నిర్వహించడం అభినందనీయం.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
కరీంనగర్లో గత పదేళ్ల కాలంలో నిర్మాణ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కొత్తగా జిల్లాల ఏర్పాటు తర్వాత కరీంనగర్లో నిర్మాణ రంగానికి ఎక్కడా ఇబ్బందులు రాలేదు. అంచనాలను తలకిందులు చేసేలా రెట్టింపుస్థాయిలో నిర్మాణ రంగం ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా మాజీ ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో బీఆర్ఎస్ సర్కారు భారీగా నిధులు ఇవ్వడంతో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చెందింది. నగరం కూడా రోజురోజుకూ విస్తరిస్తున్నది. అభివృద్ధిలో దూసుకెళ్తున్నది.
– యాదగిరి సునీల్రావు, నగర మేయర్
నగరవాసులకు కరెంటు కష్టాలు లేకుండా గృహోపకరణాల కోసం అనువైన సోలార్ ఉత్పత్తుల గురించి వివరిస్తున్నాం. అందరికీ అందుబాటులో చాలా వరకు సోలార్ ఉత్పత్తులు మా వద్ద ఉన్నాయి. ప్రతి ఇంటికీ అవసరమైన మేరకు పూర్తి స్థాయి సోలార్ సిస్టం, ప్రభుత్వ సబ్సిడీతో అందుబాటులో ఉంచాం. వాటి గురించి సందర్శకులకు వివరిస్తున్నాం. సందర్శకుల నుంచి స్పందన బాగున్నది.
– ప్రశాంత్ గడ్డం, ఎండీ (సోని సోలార్ పవర్)
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను చూడటానికి వచ్చాను. ఇక్కడ ప్రతి గంటకూ నిర్వహిస్తున్న కూపన్లో నేను బహుమతి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అనేక రకాల నిర్మాణ సంస్థలు, అన్ని హంగులతో వస్తున్న అపార్ట్మెంట్లు, వాటికి కావాల్సిన సోలార్ సిస్టం, యూపీవీసీ స్మార్ట్ విండోస్ ఇలా అన్నీ ఒక్క దగ్గరే అందుబాటులో ఉన్నయ్.
– ఎం సతీశ్, ఫ్రీ కూపన్ విజేత