రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే.. అప్పుల రాష్ట్రమంటూ అసత్యపు ప్రచారంతో ఆరు గ్యారంటీలను విస్మరించారంటూ సీఎం రేవంత్పై మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్వోటీఆర్ ప్రాపర్టీ టాక్స్లో 84.2 శాతం తెలంగాణ సొంత డబ్బులని చెప్పారు. హర్యానా రాష్ట్రం 86.9 శాతంతో మొదటి స్థానంలో ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మిత్రపక్షమైన పంజాబ్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలన్నీ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవన్నారు. కొన్ని రాష్ర్టాలు 30 శాతం కూడా లేవని, 70 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని చెప్పారు.
జార్ఖండ్, ఒడిశా 54 శాతమే మాత్రమేనని, కేంద్రం 46 శాతం ఇస్తే రాష్ర్టాలు బతికి బట్టకట్టాయన్నారు. 27.8 శాతం తెలంగాణకు అప్పులుంటే మిగిలిన 22 రాష్ర్టాలకు తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులున్నట్లు తెలిపారు. దీనిపై ఎంపీ బండి సంజయ్, సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో బలమైన పార్టీగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన గొంతు వినిపిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్పై, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అభండాలు వేశారని, పదేపదే అసత్యపు ప్రచారాలను సోషల్ మీడియాలో వైరల్ చేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ప్రతి ఒక్కరిమీద 5లక్షల అప్పు చేశారని కాంగ్రెస్ చేసిన అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టడంలో తాము విఫలమైనట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. తెలంగాణ కన్నా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు. జీతాలు ఇవ్వడం లేదని విమర్శించే ముందు ఆ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో మూడు నాలుగు నెలలకోసారి ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలు ఏనాడు ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. పెద్ద ప్రాజెక్టులు కట్టినందున, వాటిపైన డబ్బులు ఖర్చుచేసినట్లు తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు మనకు అప్పగించింది 7,770 మెగావాట్లు అని, కానీ నేడు 26వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణను అప్పుల రూపంలో చూపిస్తున్నారే కానీ, స్థిరాస్తులన్న లెక్కలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. అప్పులు తెచ్చి కట్టిన ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు, సబ్స్టేషన్ల వాటి విలువ నేడు ఎంత మేర పెరిగిందో లెక్కలు వేసుకోవాలని సవాల్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలు, కృష్ణానది, సీతమ్మ ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చుల విలువ ఈనాటికి పెరగలేదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టిన రోజు స్టీల్ ధర 27వేలు టన్ను ఉంటే నేడు 70వేలకు పెరిగిందని తెలిపారు. సిమెంట్ ధరలు పెరిగాయన్నారు. 2014,15,16లో భూసేకరణకు 2 లక్షల నుంచి మొదలుకుని 8లక్షలు వరకు ఇస్తే రైతులు సంతోషంగా తీసుకున్నారని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం లక్షల ఎకరాలు భూసేకరణ చేసినట్లు చెప్పారు. నేడు 26లక్షలు పెట్టినా ఎకరం భూమి దొరకదన్నారు. సేకరించిన ఆస్తి తెలంగాణది కాదా? అని ప్రశ్నించారు. నాడు సేకరించిన భూములు నేడు ఆ ధరకు దొరుకుతాయా? అని ప్రశ్నించారు. వేల కోట్ల విలువ గల ఆస్తులు కూడబెట్టి ఇప్పటి ప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు. అందుకే తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పగించినట్లు చెబుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 60 హామీలు, ఆరు గ్యాంరటీలిచ్చిందని, అవన్నీ చేయలేక అప్పుల రాష్ట్రం చేశారంటూ బదనాం చేస్తున్నారని కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. అమెరికా, చైనా, జపాన్ ఎక్కువ అప్పులు తీసుకుని ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని చెప్పారు.
సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఒక బైక్ కొనుక్కున్నా ఈఎంఐ చెల్లిస్తాయని, అంటే అప్పులు చేసినట్లు కాదన్నారు. దీనిపై రేవంత్రెడ్డి, బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు, అప్పులంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దన్నారు. తీసుకున్న అప్పుల్లో ఒక్క ఇన్స్టాల్మెంటు కూడా ఎగ్గొట్టలేదన్నారు. తీసుకున్న అప్పులు కూడా పదేండ్ల తర్వాత కట్టాల్సి ఉంటుందని, అయినప్పటికీ నెలనెల చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీ, కాంగ్రెస్కే పోటీ అంటూ బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 39 మంది శాసనసభ్యులున్న బలమైన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్కు డిపాజిట్ ఎలా పోతుందని, కాంగ్రెస్ డిపాజిట్ పోయేంత అధ్వానంగా లేదన్నారు. దీన్ని బట్టి ఎవరూ ఎవరికి పరోక్షంగా మద్దతిచ్చారో ప్రజలకు తెలుసునన్నారు. మధు యాష్కీ అధ్వానమైన లీడర్ కాదని, కాంగ్రెసోల్లు బీజేపీకి మద్దతిచ్చారని విమర్శించారు. నల్గొండ, భువనగిరిలో కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేసిందన్నారు. ఈరెండు పార్టీల వైఖరిని గుర్తించిన తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్కు అక్కడక్కడ బీజేపీతోనూ, మరికొన్ని చోట్ల కాంగ్రెస్తోనూ పోటీ ఉంటుందన్నారు. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నప్పటికీ, చాలా స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. బండి సంజయ్ ఇచ్చే పోటీని ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు బొల్లి రాంమోహన్, బండ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.