మల్యాల (కొడిమ్యాల), జనవరి 18: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదేండ్లలో ఐదు కొత్తలు కూడా తేలేదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. అబద్ధపు పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారు హామీల అమలులో తాత్సారం చేస్తున్నదని దుయ్యబట్టారు. వాగ్దానాలు నెరవేర్చకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎట్టిపరిస్థితుల్లో తలవంచబోమని తేల్చిచెప్పారు.
ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల తరుఫున పోరాడుతామని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేసి కరీంనగర్ గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. మల్యాల మండలం రాంపూర్లో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్ర పోరును పతాకస్థాయికి తీసుకెళ్లారు.
ఉద్యమానికి జడిసే కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. 2014 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎంపీలం పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించామని గుర్తు చేశారు. కరీంనగర్ ఎంపీగా తాను.. అనేక అభివృద్ధి పనులు చేశానని, ప్రధాని మోదీతో చర్చించి కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్పించి వెయ్యి కోట్లు తెచ్చానని చెప్పారు. కరీం’నగరా’నికి నలు దిక్కుల జాతీయ రహదారులు నిర్మించామని చెప్పారు.
అలాగే కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వేలైన్ను మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. 2009లో ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ రైల్వే ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుబంధు కోసం కేటాయించిన 7700 కోట్లను ఉద్యోగుల వేతనాలకు మళ్లీంచామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ సర్కారు రైతులను ఎందుకు విస్మరించిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, జడ్పీటీసీ రాంమోహన్రావు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్లు మధుసూదన్రావు, సాగర్రావు, రాంలింగారెడ్డి పాల్గొన్నారు.