గన్నేరువరం, ఫిబ్రవరి 29: ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే రైతులు రోదిస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకోవద్దని, సకాలంలో సాగునీరందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో సాగునీరందక ఎండుతున్న పంట పొలాలు, నెర్రెలు వారిన చెరువు, సాగునీటి కాలువను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కేసీఆర్ సర్కారు పాలనలో ఎప్పుడు అవసరముంటే అప్పుడు సాగునీరు వచ్చేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండుతున్న పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. రాబోయే పదిహేను రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, పంట పొలాలు ఎండిపోయే ముప్పు ఉన్నదన్నారు. మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యాం నిర్మించి వెంటనే నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలని, అకడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి తరలించి కాలువల ద్వారా యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు జకల నాగరాజు, దిటి రాజు ఉన్నారు.