కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 29 : కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్కుమార్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా అట్టర్ ప్లాప్ అయ్యారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్లోని 37వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం సంజయ్లో మొదలైందని, అందుకే మాజీ ఎంపీ వినోద్కుమార్పై ఇష్టంవచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోవాలని హితవుపలికారు.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్, జగిత్యాల నుంచి వరంగల్ జాతీయ రహదారి, ఎల్కతుర్తి, సిద్దిపేట జాతీయ రహదారి ఎవరు తెచ్చారో, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎలా వచ్చిందో? చెప్పాలని నిలదీశారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు తీసుకురాని దద్దమ్మ బండి సంజయ్కి వినోద్కుమార్ను విమర్శించే అర్హత లేదని హితవుపలికారు. పెద్ద హిందువునని చెప్పుకునే బండి సంజయ్ వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంటలోని ఆలయాల అభివృద్ధికి ఎందుకు నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. అది చేతగాదు గానీ, మతం పేరుతో మాత్రం యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు.
కేసీఆర్ ఎన్ని యాగాలు, పూజలు చేశారో ప్రపంచమంతా తెలుసునని, యాదాద్రి వంటి మహాక్షేత్రాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్దని స్పష్టం చేశారు. అలాంటి వారిని పట్టుకొని నాస్తికులు అని అనడం సంజయ్ అవివేకమని, అసలు నాస్తికులు అని ఎవరిని అంటారో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. గంగుల కమలాకర్, వినోద్కుమార్ కృషితో కరీంనగర్కు టీటీడీ దేవాలయం వచ్చిందని, ఇది తెలుసుకోకుండా సిగ్గులేకుండా విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు.
ఐదేళ్లలో ఎంపీగా ఎన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బట్టేబాజ్ మాటలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ అంటే అబద్ధాలు, అసత్య ప్రచారాలని ధ్వజమెత్తారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, నాయకులు చంద్రశేఖర్, ఆరే రవి, సత్తినేని శ్రీనివాస్, వొడ్నాల రాజు పాల్గొన్నారు.