గంగాధర, జనవరి 27: నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. గంగాధర మండలం ర్యాలపల్లి పంచాయతీ పరిధిలో కుర్మపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు.
రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గ రైతులు నారాయణపూర్ రిజర్వాయర్ను నమ్ముకొని వరి సాగు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో సాగుకు సరిపడా నీరందించడంతో రైతులు బంగారు పంటలు పండించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారును నమ్మి నాటేసిన రైతులు ఇప్పుడు నీరందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రైతుబంధు రాలేదని, రుణమాఫీ చేయలేదన్నారు.
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే రైతులకు వారిపై ఉన్న ప్రేమ ఇట్టే తెలుస్తున్నదన్నారు. పదిహేను ఏండ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి స్పందించి రెండు రోజుల్లో నారాయణపూర్ రిజర్వాయర్కు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇక్కడ ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు దానె ఓదెలు, దూలం శంకర్గౌడ్, ఐలయ్య ఉన్నారు.