గంగాధర, మార్చి 31/రామడుగు(చొప్పదండి) : వరదకాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొండన్నపల్లి వరదకాలువ వద్ద ధర్నా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి సాయంత్రం నీటిని విడుదల చేసిందని, ఇది బీఆర్ఎస్ విజయమని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. అర్ధరాత్రైనా అపరాత్రైనా రైతులకు బీఆర్ఎస్ అండగా ఉండి పోరాడుతుందని చెప్పారు.
కాగా, వరద కాలువకు నీటిని విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ ఆయన రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంపుహౌస్ వద్ద రాత్రి పూజలు చేశారు. సాగు నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ సర్కారు పట్టించుకోక పోగా, కనీసం ప్రణాళికలు కూడా చేయకపోవడం చేతగానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. రైతులకు ఎలాంటి కష్టాలు వచ్చినా రైతుల పక్షాన నిలబడతామని, వారికి న్యాయం చేయడమే బీఆర్ఎస్ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.