ధర్మారం, జనవరి 24: రైతు భరోసా, రుణమాఫీకి అప్పులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పెద్దల ముందు తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 45 రోజులు దాటుతున్నా నెరవేర్చడంలో జాప్యమెందుకు చేస్తున్నదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ సర్కారును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశానికి కొప్పుల హాజరై మాట్లాడారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఇప్పుడు సాకులు చెబుతూ తప్పించుకొనే యత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన అసమర్థ పాలనను రైతులు గమనిస్తున్నారన్నారు. అన్నదాతకు అండగా నిలువాల్సిన సర్కారు మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమైందని, ఈ దిశగా మోటర్ల జియో ట్యాగింగ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారని మండిపడ్డారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సమరోత్సాహంతో సన్నద్ధం కావాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయామని ప్రజల్లో చర్చ మొదలైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షసాధింపులకు దిగితే సహించబోమని, వారికి అండగా ఉంటూ ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు పూస్కూరు రామారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.