పెగడపల్లి, జనవరి 13 : సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రైతంగాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారని, అప్పులు తీసుకొచ్చేందుకు ఎఫ్ఆర్బీఎంపై సంతకం చేశారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెగడపల్లిలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేంద్రం అమలు చేసిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు జియో ట్యాగింగ్ చేస్తోందని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తి విఫలమైందని, ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని, కాంగ్రెస్ హామీలను ప్రశించాలని పిలుపునిచ్చారు. అధిష్టానం ఆదేశిస్తే పెద్దపల్లి ఎంపీ బరిలో పోటీలో ఉంటానని, టికెట్ ఎవరికి వచ్చినా, పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు వోరుగంటి రమణారావు, ఎంపీపీ శోభా-సురేందర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లారెడ్డి, వెంకన్న, యూత్ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, రాజశేఖర్, వైస్ ఎంపీపీ గంగాధర్, విండో చైర్మన్ వేణుగోపాల్, నాయకులు పాల్గొన్నారు.