కరీంనగర్ కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 18: బీఆర్ఎస్ను అక్కున చేర్చుకుని ఆదరించిన అల్గునూర్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. అల్గునూర్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు బీఆర్ఎస్ జెండానే ఎగిరిందన్నారు. ఎనిమిదో డివిజన్ అల్గునూర్ కార్పొరేటర్గా కాల్వ మల్లేశం గెలుపొందగా, డివిజన్ అధ్యక్షుడు సల్ల మహేందర్ ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి రసమయి హాజరై మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్లో మూడో భారీ మెజార్టీతో మల్లేశం గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. రెండుసార్లు ఓడిపోయిన ఆయనకు ప్రజలు ఆశీస్సులు ఉన్నాయన్నారు. 1,095ఓట్ల మెజార్టీని అందజేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటారని హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం కార్పొరేటర్ మల్లేశం మాట్లాడుతూ, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు పోగొట్టుకోనన్నారు. భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు సర్ధ్దార్ రవీందర్సింగ్, గుగ్గిళ్ల జయశ్రీ, సుధగోని మాధవి, ప్రేమలత, సింగిల్విండో మాజీ డైరెక్టర్ స్వామిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, యూత్ అధ్యక్షుడు గట్టపల్లి దీపక్, నాయకులు పరశురాములు, దాసం కమలాకర్, లంక రవి, అంజి, తదితరులు పాల్గొన్నారు.