కరీంనగర్: చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్పాయిజనింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. గురుకులంలో ఆహార పదార్థాలను పరిశీలించారు. బాలికలు అందరూ క్షేమంగా కోలుకుంటున్నారని, ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు.
చొప్పదండి సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రిన్సిపాల్తో రవి శంకర్ మాట్లాడారు. ఫుడ్ పాయిజనింగ్ గురించి సమాచారం అందిన వెంటనే కరీంనగర్ కలెక్టర్కు ఫోన్ చేసిన ఆయన.. తక్షణం అత్యవసర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ప్రిన్సిపాల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో క్యాబేజీ కూర వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని చెప్పారు. పిల్లలంతా కోలుకుంటున్నారని, ఆరోగ్యంగానే ఉన్నారని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.