కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : అన్నదాత కల చెదిరిపోయింది. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసంతో ముఖం చిన్నబోయింది. ‘మీరు పంటలు వేసుకోండి. మేం నీళ్లిస్తాం’ అని ఎన్నికల ముందు ఆ పార్టీ చెప్పిన మాటలను నమ్మి సాగు చేసినా పాపానికి పంట ఎండుతున్నది. ఎక్కడికక్కడ నేల నెర్రెలు బారుతున్నది. ఇన్నాళ్లూ గోదారి జలసిరులు, మానేరు పరవళ్లతో కళకళలాడినా, ఇప్పుడు చుక్క నీటి కోసం నోళ్లు తెరిచి చూస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్ల పిల్లర్లను సాకుగా చూపుతూ.. నీళ్లు ఉన్నా విడుదల చేయకపోవడం, మరోవైపు నీళ్లిస్తామని మాటిచ్చి ప్రభుత్వం చేతులెత్తేయడంతో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నది. ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతుండగా, రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కుతున్నారు. నీళ్లివ్వాలంటూ.. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. అయినా ప్రయోజనం లేక చేతికొచ్చిన పంటలను వదిలేస్తున్నారు. కాపాడునే దారి లేక పశువులను మేపుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఆగ్రహిస్తున్నారు. పదేండ్లలో రాని కరువు, ఇప్పుడెందుకు వస్తదని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా పాలనా వైఫల్యమే అని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఏ బాధాలేకుండా ఎవుసం చేసుకున్నామని గుర్తు చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అరిగోస పడుతున్నామని మండిపడుతున్నారు. మార్పంటే పంటలు ఎండబెట్టుడేనా..? నీళ్లివ్వకుండా రైతును గోస పెట్టుడేనా..? అని ప్రశ్నిస్తున్నారు. మార్పంటే పది మందికి మేలు జరగాలని, ఇలా గోసపెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇట్లాంటి మార్పు అస్తదనుకోలె
కాంగ్రెస్ సర్కారు అస్తే మార్పస్తది అన్నరు. కానీ, ఇట్లాంటి మార్పు అస్తదనుకోలె. తొమ్మిదేండ్లు కేసీఆర్ దయతోనే మా రైతులకు సాగునీటి కష్టాలంటే తెల్వకుండా పోయినయ్. కానీ, కాంగ్రెస్ సర్కారు అచ్చినంకనే సాగునీరు లేక రైతులు రోడ్డు మీద పడే పరిస్థితులు వచ్చినయ్. నీళ్లియ్యం, నీళ్లు రావు అని ముందే చెపితే మేం పంటలు సాగు చేసేటోళ్లం కాదు కదా. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్నీ చేస్తమని చెప్పిన కాంగ్రెస్సోళ్లు ఇప్పుడు వంద రోజులు దాటి పోయినంక చూద్దామని అంటున్నరు. నేను ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న. నీళ్లు లేక మొత్తం ఎండింది. పెట్టిన పెట్టుబడులు, కౌలు పైసలు అన్నీ మునిగినట్టే. ఎంతలేదన్నా నాకు 2 లక్షల రూపాయల పైననే నష్టం జరిగినట్టే.
– నరెడ్ల వెంకన్న, రైతు, మంథని
పొలానికి ట్యాంకర్ ద్వారా నీరు
పొలానికి ట్యాంకర్ ద్వారా నీరుపడుతున్న రైతు పేరు కథలాపూర్కు చెందిన శీరం శంకర్. ఆయనకు రెండెకరాల భూమి ఉన్నది. ఇన్నాళ్లూ వరదకాలువే ఆధారంగా ఉండేది. కాళేశ్వరం జలాలతో ఆ కాలువ నిండుగా ఉండి సమీపంలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండేవి. దాంతో బోర్లలో నీళ్లుండి సాగునీటికి ఏనాడూ ఇబ్బంది రాలేదు. కానీ, ఈ యాసంగిల మాత్రం వరదకాలువలో నీళ్లు లేక బోర్లు అడుగంటాయి. పంట ఎండిపోయే దుస్థితి రాగా.. ఆందోళన చెందాడు. ఎలాగైనా పంటను రక్షించుకోవాలనే తపనతో బుధవారం ట్యాంకర్ ద్వారా పొలానికి నీరందించాడు. ఐదు ట్రిప్పుల్లో ట్యాంకర్ ద్వారా పంటలకు నీళ్లందించానని, ఒక్కో ట్రిప్పునకు వెయ్యి చొప్పున చెల్లించానని శంకర్ చెబుతున్నాడు. రోజు విడిచి రోజు మరో పది రోజులపాటు రోజుకు ఐదు ట్రిప్పుల వరకు ట్యాంకర్ ద్వారా నీరందిస్తేనే పంట దక్కుతుందని వాపోతున్నాడు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ నీళ్లకు ఇబ్బంది పడలేదని గుర్తు చేస్తున్నాడు. కానీ, కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అరిగోస పడుతున్నామని మండిపడుతున్నాడు.
మూన్నెళ్లకే సావు సత్తన్నం
మేడిగడ్డ పిల్లర్ కుంగిందని తాపతాపకు సూపిస్తూ నీళ్లియ్యకుండా రేవంత్రెడ్డి మమ్మల్ని నిండా ముంచిండు. మిడ్మానేరు కట్టతెగితే కేసీఆర్ సారు మళ్లీ బాగుజెయ్యలేదా..? పదేండ్లలో ఎన్నడూ గింత గోస చూడలే. పక్కనే అన్నపూర్ణ ప్రాజెక్టు ఉండె. ఒర్రెల నుంచి పారిన నీళ్లను పైపులు పెట్టి పంటకు పారించుకున్న. మూడున్నర ఎకరాల్లో పుట్ల కొద్ది వడ్లచ్చినయ్. ఎవుసం మంచిగున్నదని 10 లక్షల బ్యాంకు లోను తీసుకుని పక్కనే భూమి కొన్న. ఇప్పుడు నీళ్లు లేక మూడున్నర ఎకరాల్లో ఏసిన వరి అంతా ఎండి పోయింది. వచ్చి సూడమని సార్లను బతిమిలాడినా ఎవరూ పట్టించుకుంటలేరు. కడుపు మండి పంటకు నిప్పు పెట్టుకుని గొడగొడ ఏడ్చిన. మార్పు రావాలె. మార్పు రావాలె అన్నరు. నా బొంద మీద పెట్టుకునేటందుకా? కొత్త సర్కారొచ్చిన మూన్నెళ్లకే సావు సత్తున్నం. తిండికే గోసయితంది. తెచ్చిన అప్పులెట్ల గట్టాలె.
– అరుకాల మల్లేశం, రైతు, పెద్దలింగాపూర్ (ఇల్లంతకుంట)
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే
మాది చెర్లభూత్కూర్. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉంటది. సాగునీళ్లకు డీ89, డీ90 కెనాళ్లే ఆధారం. నాకు ఊళ్లే ఎకరం భూమి ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఎకరానికి రూ.35వేల పెట్టుబడి పెట్టి వరి వేసిన. ఎస్సారెస్పీ కాలువ ద్వారా మొదటి తడి నీళ్లు వస్తయని సంబురంగా సాగు చేసిన. కానీ నీళ్లు రాలె. నేను 25 ఏండ్ల సంది ఎవుసం చేస్తున్న. నీళ్లు రాని రోజు ఎన్నడూ లేదు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. వారబంధీ ప్రకారం ఇస్తామన్నోళ్లు నెలకు ఒకసారి కూడా ఇయ్యలె. గత యాసంగిలో ఇదే టైంకు కాలువలో పుష్కలంగా నీరు పారింది. పంటలు మంచిగా పండినయి. ఇప్పుడు మాత్రం ఆశలేకుండా పోయింది.
– దాసరి భగవాన్ రెడ్డి, చెర్లభూత్కూర్ (కరీంనగర్రూరల్ మండలం)
అప్పులు ఎట్ల కట్టాలె?
నాకు భూషణ్రావుపేటలో మూడెకరాల భూమి ఉంది. అప్పు చేసి పెట్టుబడులు ఎల్లదీసుకున్న. గతంలో వరద కాలువ నిండుకుండలా ఉండేది. ఈ సారి నీళ్లు వస్తయని ఆశతో సాగు చేసిన. కానీ వరద కాలువల నీళ్లు వస్తలేవు. మా బోరు బావుల్లో నీరు లేకుండా పోయింది. మూడెకరాల పంట ఎండిపోయింది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు ఎట్ల కట్టాలో అర్థమైతలేదు. సర్కారును పట్టించుకున్నట్లు అనిపిస్తలేదు. భయంభయమవుతున్నది.
– తరి భూమ గంగు, భూషణ్రావుపేట (కథలాపూర్ మండలం)
ఒక్కసారి కూడా నీళ్లు రాలే..
ఎండిన పొలంలో దీనంగా కనిపిస్తున్న ఈ రైతు పేరు దాసరి వీర మల్లారెడ్డి. కరీంనగర్రూరల్ మండలం చెర్లభూత్కూర్. ఆయన రెండున్నరెకరాలు సాగు చేసిండు. శ్రీరాంసార్ ప్రాజెక్టు డీ-93 డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఈ రైతు పంటకు నీళ్లు వచ్చేటియి. ఈసారి యాసంగిల ఒక్కసారి కూడా నీళ్లు రాలె. దీంతో ఇప్పటికే ఎకరన్నర పొలం ఎండి పోయింది. ఆయన తమ్ముడు భగవంత్రెడ్డికి చెందిన మూడెకరాల్లో రెండెకరాలు ఎండిపోయింది. కాలువ నీళ్లు వస్తే చెరువులో నీళ్లుండేవని, బావుల్లో నీళ్లు ఒడిసేవి కాదని, కాంగ్రెస్ సర్కారు వచ్చినంక నీళ్లు రావడం లేదని మల్లారెడ్డి వాపోతున్నడు. ఎకరన్నర పంట ఎండిపోవడంతో తాను, తన తమ్ముడే కాకుండా తమ గ్రామానికి చెందిన చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని చెబుతున్నడు.
అడుగంటిన బావి.. ఎండిన పొలం
..ఇక్కడ ఎండిన పొలంలో నిల్చున్న రైతు పేరు కాసం కళ్యాణి. గంగాధర మండలం చిన్నాచంపల్లి గ్రామం. ఆమె రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేసింది. ఐదేళ్లుగా వరదకాలువలో నీళ్లు ఉండడం.. భూగర్భ జలాలు పెరగడంతో ఏ రందీ లేకుండా పంటలు పండించింది. ఈ ఏడాది కూడా రెండెకరాలు కౌలుకు తీసుకుని రూ.30 వేల పెట్టుబడి పెట్టి వరి సాగు చేసింది. అయితే, సర్కారు వరదకాలువకు సరైన సమయంలో నీటిని విడుదల చేయలేదు. దాంతో భూగర్భ జలాలు పడిపోయినయి. బావి అడుగంటింది. నీరందక పంట ఎండిపోయింది.
మూడు లక్షల దాకా మునుగుడె
నేను పదేండ్ల నుంచి కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తన్న. హుస్సేన్మియా వాగులో బోర్లు ఏసుకొని పొలం పారించుకుంటున్న. మోయేడైతే నీళ్లు ఎక్కువై ఫీజులు తీసేసిన. కానీ, ఈ యేడు నీళ్ల చుక్క వస్త లేదు. ఎన్నడూ ఇంతగనం కరువు రాలె. నా పదెకరాల పొలం పొట్టకచ్చే దశల ఎండిపోయింది. ఇప్పటికే కౌలు, ఖర్చులు మూడు లక్షల రూపాయల దాకా అయినయి. ఇంత ఘోరంగా మునుగుతా అని నేనెన్నడూ అనుకోలె.
– నూనెశంకర్, రైతు, హన్మంతునిపేట(పెద్దపల్లి)
చుక్కనీరు రాలె
మాది చెర్లభూత్కూర్. నేను 20 ఏండ్ల సంది ఎవుసం జేస్తన్న. డీ89 కెనాల్ కింద ఊళ్లే నాకు నాలుగెకరాలు ఉన్నది. అధికారులు ఎప్పటిలాగే ఈ సారి వారబంధీ పద్ధతిన నీళ్లు ఇస్తమంటే పంట వేసినం. కానీ, చుక్క నీరు రాలె. ఇచ్చే కొద్దిపాటి నీళ్లూ చామనపల్లి వరకే వస్తున్నయి. మా చెర్లభూత్కూర్కు అందుతలేవు. పంటలేం పండుతున్నయి. ఇప్పటికే చాలా మంది పొలాలు ఎండినయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు మంచిగుండె. ఏ బాధా లేకుండ ఎవుసం చేసుకున్నం. ఈ సీజన్ల మాదాక నీళ్లు రానేలేదు. అధికారులు ఇదే చివరి తడి అంటున్నరట. కనీసం ఇంకో రెండు తడులైనా గట్టిక అందిస్తే కొందరి పంటలైనా దక్కుతయి.
– దాసరి రాజిరెడ్డి, చెర్లభూత్కూర్(కరీంనగర్రూరల్ మండలం)
పరిహారం ఇచ్చి ఆదుకోవాలి
నాకు రెండెకరాల పొలం ఉంది. కాలువ నీళ్లు రానప్పుడు బాయికి మోటర్ పెట్టుకుని పండించుకొనేటోన్ని. ఇప్పుడు కాల్వకు నీళ్లు వస్తలేవు. బాయిలో నీళ్లు లేక అడుగంటినయి. ఇంకో ఎకరం పది రోజులయితే ఎండిపోతది. పెట్టుబడి అంతా అప్పు తెచ్చి పెట్టిన. ఇప్పుడు ఏం చేయాలో అర్థంమయితలేదు. ప్రభుత్వం నష్టపోయిన రైతుకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– పెసరు స్వామి, రైతు (ఎండపల్లి)
ఈ సర్కారుపై నమ్మకం అనిపిస్తలేదు
మా నాన్న మూడేళ్ల కిందట గుండెపోటుతో చనిపోయిండు. డిగ్రీ చదివిన నేను మాకున్న మూడున్నరెకరాల్లో ఎవుసం చేసుకుంటున్న. నా తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న. పదేండ్ల కేసీఆర్ సారు పాలనలో సాగునీటికి తండ్లాడలేదు. పక్కనే ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టుల నుంచి ఒర్రెలు, కాలువల్లో వచ్చిన నీళ్లనే పంటకు మళ్లించుకున్నం. కాంగ్రెస్ వచ్చుడేమో కానీ సాగునీళ్లకు గోసగోసయితంది. ప్రాజెక్టుల్లో నీళ్లులేవు. ఒర్రెలు ఎడారి అయినయ్. మూడున్నరెకరాల పంట ఎండి పోయి బర్రెలు మేసినయ్. పంటకు పెట్టిన రూ.లక్ష చేతికి రాలేదు. ఈ సర్కారు ఆదుకుంటుందని నమ్మకం అనిపిస్తలేదు.
– దండవేని రజినీకాంత్, రైతు, పెద్దలింగాపూర్ (ఇల్లంతకుంట)