ఇస్లామాబాద్, ఆగస్టు 21 : ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పిమ్స్)లో వైద్య పరీక్షల అనంతరం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను శుక్రవారం ఉదయం రావల్పిండిలోని అడియాలా జైలుకు తిరిగి తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పరీక్షల సమయంలో అల్-షిఫా దవాఖాన వైద్యులు కూడా అక్కడ ఉన్నారు. సుప్రీంకోర్ట్ ఆదేశం మేరకు పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) వ్యవస్థాపకుడిని ప్రైవేట్ యాజమాన్యంలోని షిఫా ఇంటర్నేషనల్ దవాఖానకు తరలించినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అంతర్జాతీయ మీడియా ప్రతినిధి జుల్ఫీ బుఖారీ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్(73) లెవల్ త్రీ ప్లస్ ఆందోళనతో బాధపడుతున్నారని కోర్టుకు సమర్పించిన వైద్య నివేదిక ఆధారంగా రెండు రోజుల్లోగా ఆయనను దవాఖానకు తరలించాలని ఈనెల 18న సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా ఇస్లామాబాద్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా ఇమ్రాన్ ఖాన్ను ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లకపోవడం పట్ల ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇమ్రాన్ ఖాన్ను పిమ్స్కు తరలించడం ద్వారా ప్రభుత్వం కోర్టు ఉత్తర్వును ఉల్లంఘించిందని ఆయన అన్నారు. ఈ పరిణామాన్ని అత్యంత దురదృష్టకరంగా ఆయన అభివర్ణిస్తూ ఇది కేవలం సుప్రీంకోర్టును అవమానించడమే కాకుండా మొత్తం న్యాయవ్యవస్థను అగౌరవపరచడమేనని పీటీఐ నాయకుడు అన్నారు. ఇలా ఉండగా రావల్పిండి జైలు నుంచి ఇస్లామాబాద్లోని దవఖానకు తరలించిన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్పై ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూలు జల్లుతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జైలు నుంచి త్వరగా విడుదల కావాలంటూ నినాదాలు చేశారు.