“మీ10 హెచ్పీ మోటర్లు వద్దు.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుడు వద్దు.. 10 హెచ్పీ మోటర్లు పెట్టి.. మీటర్లు పెడితే ఎవుసం చేసుడు సాధ్యమైతదా..? అంత పెద్ద మోటర్లు, వాటికి పైపులు ఎవరు కొంటరు..? వాటికి సరిపోయే కరెంటు ఎట్లిస్తరు.? మూడు గంటల కరెంటుతోని అంత పెద్ద మోటర్లు ఒకేసారి పెడితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా? ఎక్కడికక్కడ పేలిపోవా? మోటర్లు కాలిపోవా? ఇష్టమొచ్చినట్లు పూటకో మాట మాట్లాడితే ఎవరు నమ్ముతరు? మమ్మల్ని ముంచాలని చూస్తున్నరా?” అంటూ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని అంటూనే 10 హెచ్పీ మోటర్ వాడాలని ఉచిత సలహా ఇస్తుండడంపై మండిపడుతున్నారు.
అన్ని రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లు పెట్టారని ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం.. అందులో కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాలు కూడా ఉండడంతో ఆ పార్టీ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బయటపడిందని, ఇక్కడ కూడా మోటర్లకు మీటర్లు పెట్టే నిబంధనను ఒప్పుకుని రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదని ధ్వజమెత్తుతున్నారు. అంతే కాకుండా ధరణిని రద్దు చేసి దశాబ్దాల కాలంగా భూ సమస్యలతో అరిగోస పెట్టిన పాత రెవెన్యూ వ్యవస్థను మళ్లీ తెస్తామంటుండడంపై కన్నెర్రజేస్తున్నారు. కాంగ్రెస్ సచ్చేది లేదు.. వచ్చేది లేదని.. ఎట్టి పరిస్థితిలో ఆ పార్టీ నాయకులను నమ్మేది లేదని స్పష్టం చేస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ)
ధరణిలో పేరు ఉంటే భూములు కబ్జా కావు అన్న భరోసా వచ్చింది. వ్యవసాయ భూములపై పట్టాదారుకు పూర్తి హక్కులుంటయి. పట్టాదారు పాసు పుస్తకాల్లో పేరు ఉంటే వారికి రైతుబంధు కింద బ్యాంకుల్లో నగదు జమవుతుంది. నాడు పట్టా పాసు పుస్తకంలో వంద కాలమ్స్ ఉండేవి. ఇప్పుడు ఇచ్చే పాసు పుస్తకంలో తక్కువ కాలమ్స్ ఉన్నయి. నాడు ఉన్న రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేస్తే అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. గతంలో పట్వార్లు, ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొన్నంక మ్యూటేషన్ అయ్యేందుకు నానా అవస్థలు పడేటోళ్లం. కాంగ్రెస్ మళ్లీ పాత పద్ధతి తీసుకచ్చి రైతుల మధ్య కిరికిరి పెట్టాలని చూస్తంది. అలా జరగనిచ్చేదే లేదు. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. ధరణిని కాపాడుకుంటం. బీఆర్ఎస్కు మద్దతిస్తం.
– కర్ర నారాయణ రెడ్డి, రైతు, గంగిపల్లి (మానకొండూర్ రూరల్)
ధరణి రాక ముందు మస్తు ఇబ్బందులుండే. కార్యదర్శుల సుట్టూ.. ఎమ్మార్వోల సుట్టూ తిరుగుడుండే. పట్టాదారు పాసు పుస్తకాలల్ల ఎక్కినా కూడా పేర్లు మారేటియి. మా భూమి మాకు ఉంటదా.. పోతదా..? తెల్వకుండె. కేసీఆర్ సారు అచ్చిన తర్వాత ధరణి తెచ్చిన్రు. గ్రామాలల్ల పహణీలు పెట్టిన్రు. ఊర్లళ్ల ఎవ్వల భూమి, ఎవ్వరికున్నదో రికార్డులు పరిశీలించిన్రు. పేర్ల బదలాయింపునకు దరఖాస్తులు పెట్టుకున్నం. అప్పటి వరకున్న లొల్లులు, పంచాయితీలు ఇప్పుడు ఊళ్లల్ల లేకుండా పోయినయ్. అసలు ధరణి వచ్చిన తర్వాత రైతుల దరిద్రమంతా పోయింది. ఇప్పుడైతే సంబురంగున్నం. కాస్తులొగని పేరు.. కౌలుల మరొగని పేరు.. ఇట్లా ఎవ్వని పేరు లేకుండా పోయింది. నా భూమి.. నా పేరు.. అంతే.. నా పుస్తకం నాకు వచ్చింది. దర్జాగుంటున్న. మల్ల ధరణి పోతే ఇబ్బందులు పడ్తం. కాంగ్రెసోళ్లు సోయి లేకుండా మాట్లాడుతున్నరు. ఆ పార్టీ అంటేనే ఓ దరిద్రం. అట్లాంటి పార్టీ ధరణి రద్దు చేస్తామంటే ఒప్పుకుంటమా?. వాళ్లను రానివ్వం.
-మామిడి తిరుపతిరెడ్డి, రైతు (జమ్మికుంట)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న మూడు గంటలకు కరెంటుకు ఎకరం పొలం కూడా పారదు. బోరు, బావుల్లో నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోతాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్తో అవసరం ఉన్నప్పుడు పంటలకు నీళ్లు పెడుతున్నం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రెండు మూడు పంటలు పండించుకుంటున్నం . 24గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వైపే మేముంటం.
-కొమ్మెర రాంరెడ్డి, రైతు, గొల్లపల్లి (తిమ్మాపూర్ రూరల్)
ఎప్పుడంటే అప్పుడు పోయి కరెంటు పెట్టడం అలవాటైంది. గిప్పుడు మల్ల ఎనకటి లెక్క మూడు గంటలు ఇత్తం.. పెద్ద మోటర్లు పెట్టుకోవాలంటే ఎట్ల. గిన్ని రోజులు రికాం లేకుంట కష్టపడ్డం. గిప్పుడుగిప్పుడే మేం కొద్దిగ సంతోషంగ ఉన్నం. ఆళ్ల కాలంల ఎవుసం జేద్దామంటే అరిగోస అయ్యేది. పునాసకు ఒక్క పీజ కట్టేటల్లకు కరెంటు పోయేది. మల్లత్తే కాలువ పారేటల్లకే సరిపోయేది. గిప్పుడు కరెంటు ఎప్పుడూ ఉంటంది. ఎప్పుడంటే అప్పుడు పోయి బాయికాడ మోటరు పెట్టుకుంటున్నం. గిట్లనే మంచిగుంది. మూడు గంటలిస్తే గుంట పారది. రోజుకో మూల పారిచ్చుకునుడు అయితది. మేం ఎవుసం చేయల్నా? వద్దా?.
-అట్ల మల్లయ్య, రైతు (తిమ్మాపూర్)
సీఎం కేసీఆర్ సార్ ధరణి తీసుకొచ్చినంకనే చిన్న, సన్నకారు రైతులకు రికార్డుల పరమైన భరోసా కలిగింది. అప్పట్లో జాగాల పంచాయితీ కోసం మా గ్రామంలోని చానమంది నా దగ్గరికి అచ్చోటోళ్లు. మేమందరం సమస్య పరిషారం కోసం ఎమ్మార్వో ఆఫీసర్ల చుట్టూ తిరిగిన రోజులు ఎన్నో ఉన్నయి. వారసత్వంగా అచ్చిన భూమైనా.. కొన్న భూమైనా రికార్డులో ఎకించేందుకు రెవెన్యూ అధికారులు చాలా నిర్లక్ష్య ధోరణితో ఉండేటోల్లు. ధరణి లేకపోతే బలం ఉన్నోడిదే భూమి అనే చందంగా తయారైతది. ఇప్పుడు రైతులు, ప్రజలు సమస్యలతో ఆఫీసుల సుట్టూ తిరుగుడు తకువైంది.
– గాండ్ల శ్రీనివాస్, రైతు, మక్తపల్లి(తిమ్మాపూర్)
కాంగ్రెస్ అంటేనే తలా, తోకాలేని పార్టీ. వాళ్లకు వ్యవసాయం అంటే ఏందో తెల్వకుండా మాట్లాడుతన్రు. అధికారంలోకి అత్తే మూడు గంటల కరెంటిత్తరా..? ఎట్లిత్తరు. ఎట్లత్తరు. మూడు గంటలు సరిపోతదా..? ఒక్క మడి కూడా తడ్వదు. ఇప్పుడు నా ఐదెకరాల భూమిల మూడు మోటార్లు నడుత్తనయ్. ఇంటికాడుంటున్న. మోటార్లు పెట్టెత్తే సాలు.. పారుతంది. కరెంటు పోతనే లేదు. పదేండ్లళ్ల ఒక్కసారి కూడా మోటారు కాలిపోలే. ఎన్కట కాంగ్రెస్ గవర్నమెంటున్నప్పుడు రెండు నెలలకో మోటారు కాలిపోయేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రెండు పంటలు తీస్తన్న. ఇగ కాంగ్రెస్ మళ్లీ అత్తే.. అంతే. బాయిల కాడికి మంచాలెత్తుకొని పోవాలే. అక్కడే పండాలే. తేళ్లో, పాములో కుట్టి సచ్చు డైతది. మా సావులకు కాంగ్రెస్నెట్లా గెలిపిస్తం. కేసీఆర్కే ఓటెత్తం.
-పొద్దుటూరి తిరుపతిరెడ్డి, రైతు, పెద్దంపల్లి (జమ్మికుంట మండలం)
ధరణి తీసేస్తె మళ్లీ పాత రోజులు వస్తయి. మా రైతులమందరం ఆఫీసుల సుట్టూ తిరుగుడు ఐతది. భూములు ఆగమాగం అయితయి. కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు మా ఊళ్లె మస్తు అక్రమాలు జరిగినయి. ఒకల భూములను ఒక పేరుమీదికి ఎక్కిచ్చి పట్వారీలు మస్తు ఇబ్బంది పెట్టిన్రు. పైసలు ఇయ్యకుంటే పట్వారీలు భూముల పేర్లు సరిచేయకపోయేది. మస్తు ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు అట్ల లేదు. సీఎం కేసీఆర్ సారు ధరణి తెచ్చినంక మా భూములు మాకు భద్రంగా ఉంటున్నయ్. మమ్ములను కాదని అక్రమంగా వేరేటోళ్లకు పోకుండా చేసిండు. ధరణి తీసేసి మళ్లీ ఆఫీసుల పొంటి తిప్పుతరా? అట్ల చేయనిచ్చేదే లేదు. కాంగ్రెస్ను రానిచ్చేదే లేదు.
– చింతల లక్ష్మారెడ్డి, ఇస్లాంపూర్(గంగాధర)
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో రెవెన్యూ రికార్డుల్లో భూములు భద్రంగా ఉన్నయి. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరీ భూములు ఎవరికి రాసారో తెలియని పరిస్థితి. ధరణి వచ్చాకే భూములకు భద్రత వచ్చింది. ఇప్పుడు భూములు అమ్మాలన్న.. కొనాలన్న ధరణి ద్వారా నిమిషాల్లో పని అవుతుంది. ధరణిని రద్దు చేస్తే సమస్యలు పెరుగుతయి. మళ్లీ రైతులకు పాత రోజులు వస్తయి. కాంగ్రెస్కు రైతులు బాగుండడం ఇష్టం లేదనుకుంట. అందుకే ధరణిని తీసివేస్తామంటున్రు.
– గంగిపల్లి శంకర్, రైతు, మైలారం(గన్నేరువరం)