మల్లాపూర్, మే 26 : వానకాలం సమీపిస్తున్న తరుణంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వరి పంటలు వేసే ముందు భూసారం పెంపు కోసం పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు ఎంతో అవసరం ఉంటుంది. కానీ, ఇవి కావాలంటే రైతులు వేకువజామున నుండే కార్యాలయం ఎదుట గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలోని పీఎసీఎస్ కార్యాలయానికి ఇటీవలే జీలుగ విత్తనాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ముత్యంపేట, రాఘవపేట, హుస్సేన్నగర్, సిరిపూర్ గ్రామాలకు చెందిన రైతులు వాటి కోసం కోసం కార్యాలయం ఎదుట బారులు తీరారు. వచ్చిన 400 సంచులు కేవలం రెండు గంటల సమయంలోనే అయిపోవడంతో చుట్టు పక్కన గ్రామాల నుంచి వచ్చిన రైతులు విత్తనాలు దొరకక నిరాశతో వెనుదిరిగారు.