మానకొండూర్ రూరల్, జూలై 1 : నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన తనకు నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర నష్టం జరిగిందంటూ ఓ రైతు రోడ్డెక్కాడు. రహదారి పనులను అడ్డగించి నిరసన తెలిపాడు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఆ రైతునే అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన రైతు కానిగంటి కుమార్ గ్రామ ఎల్లమ్మ గుడి దగ్గర జరుగుతున్న జగిత్యాల-వరంగల్ నేషనల్ హైవే (563) పనులను మంగళవారం మధ్యాహ్నం అడ్డగించాడు. చెంజర్ల, మానకొండూర్ గ్రామాల రైతులు కూడా తరలివచ్చి మద్దుతు పలికారు.
దీంతో పనులకు అంతరాయం ఏర్పడి ఉద్రిక్తత నెలకొనగా, మానకొండూర్ సీఐ సంజీవ్, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ పోలీస్ బలగాలతో చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసుల అధికారులు అక్కడికి చేరుకున్నారు. బాధితుడు కుమార్, గ్రామస్తులతో ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ విజయ్ కుమార్ చర్చించారు. అయినా ససేమిరా అనడంతో బాధితుడు కుమార్తోపాటు ఆయన కొడుకు విజయ్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం సమయంలో విడిచిపెట్టారు. పోలీసుల పహారాలో తిరిగి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.