సిరిసిల్ల రూరల్, జనవరి 18: సీఎం కేసీఆర్, మంత్రికేటీఆర్ పిలుపుతో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలో సిరిసిల్లలోని బీఆర్ఎస్ సీనియర్ నేత చీటి నర్సింగరావు తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో తన వ్యవసాయ భూమిలో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. వ్యవసాయ పొలంలోని 10 ఎకరాల్లో 500 ఆయిల్ పామ్ మొక్కలు నాటి పెంచుతున్నారు.
ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ఆ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎకరానికి 50 మొక్కలు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నది. ఆయిల్ పామ్ పంట లాభసాటిగా ఉంటుందని, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నదని చీటి నర్సింగరావు చెప్పారు.