కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరుగుతున్నది. రాత్రీ పగలు తేడా లేకుండా ప్రభావం చూపుతున్నది. పొద్దంతే కాదు, రాత్రి పూట కూడా గజగజా వణకాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలు మరింతగా కూల్ చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతుండగా, చలి గాలులు భయపెడుతున్నాయి. దీనికితోడు రాత్రి, తెల్లవారుజామున పొగమంచు కురుస్తున్నది. మరో మూడు నాలుగు రోజులు తీవ్రత ఇలాగే ఉండనుండగా, ప్రజానీకం ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే ఇబ్బంది జంకుతున్నది.
కరీంనగర్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ మొదటి వారం నుంచే చలి తీవ్రత కనిపిస్తున్నా.. రెండు రోజులుగా మరింత వణికిస్తున్నది. రాత్రీ పగలు తేడాలేకుండా గజగజ వణకాల్సి వస్తున్నది. నిజానికి ఈ నెల 4 నుంచే పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అంతకు ముందు రోజు 32 డిగ్రీలు ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 28కి తగ్గాయి. అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంటున్నది. మంగళవారం మరో డిగ్రీ పడిపోయి 27గా నమోదైంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో 22-21 డిగ్రీలుగా ఉన్నా.. క్రమంగా 19 నుంచి 18కి తగ్గాయి.
మంగళవారం చూస్తే రాత్రి ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా నమోదయ్యాయి. తెల్లవారు జామున చలి తీవ్రతకు తోడు మంచు కురుస్తుండడంతో మరింత కనిష్టానికి పడిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా గాలిలో తేమ శాతం 40 నుంచి 53కు పెరుగుతూ వస్తున్నది. మంచు 11 సెల్సీయస్గా నమోదవుతున్నది. ఈ నెల మొదటి వారం నుంచే ఉత్తరాది నుంచి శీతల పవనాలు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం గంటకు 2 కిలోమీటర్ల వరకు ఉండగా, చలి గాలులు భయపెడుతున్నాయి.
రాత్రి సమయాల్లో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటున్నది. వచ్చే వారం వరకు చలి తీవ్రత ఇలాగే ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతున్నది. అంచనా ప్రకారం.. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21న 28-15, 22న 28-16, 23న 29-17, 24న 28-18, 25న 28-18 నమోదయ్యే అవకాశమున్నది. మరోవైపు చలి తీవ్రతతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరాల వంటి ప్రభావానికి లోనవుతున్నారు. ఆస్తమా, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ కొద్ది రోజులు తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు.