Online scams | పెద్దపల్లి రూరల్ జూలై 19 : ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, యాంటి డ్రగ్స్ పై అవగాహన కలిగి మెదలుకుంటే జీవితాలు బాగుపడుతాయని పెద్దపల్లి షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. పెద్దపెల్లి మండలం పెద్దకల్వలలో గల నోబెల్ హై స్కూల్ లో విద్యార్థులకు షీటీం అవగాహన సదస్సు నిర్వహించారు..
ఈ సందర్భంగా షీటీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్ పై అవగాహనతో మెదలుకుంటే అందరిజీవితాలు బాగుపడుతాయని, లేదంటే వాటి బారిన పడి బానిసలుగా మారితో జీవితాలు బజారున పడుతాయని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రతీ రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలతో పాటు జనం రద్దీగా ఉండె ప్రాంతాల్లో కళాశాలల వద్ద షీటీం నిరంతరంగా గస్తీ తిరుగుతున్నారని, ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా నేరుగా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు.
ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్ లైన్ మోసాలు, లోన్ యాప్స్ గురవుతున్నారని, వాటికి జోలికి పోకుండా ఉండాలన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారమివ్వాలన్నారు. అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీటీమ్ సభ్యులు మౌనిక, సురేష్, కరస్పాండెంట్ మోహన్ రాజా, హెడ్ మాస్టర్ ప్రణిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.