ఉమ్మడి జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉండే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ రైల్వేలైన్ పొడవు 151.34 కిలోమీటర్లు అయినా.. ఇప్పటివరకు 42.6 కిలోమీటర్లు దాటలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం మూడో వంతు నిధులు ఇస్తున్నా.. కేంద్రం మాత్రం నిధులు కేటాయించడమే తప్ప ఇవ్వడం లేదు. కరీంనగర్-కాజీపేట వయా హుజూరాబాద్ నూతన రైల్వేలైన్ డీపీఆర్ తయారీకి గత ఎంపీ వినోద్ ఒప్పించినా నిధుల ప్రస్తావనే లేదు. రామగుండం నుంచి మణుగూరు వయా మంథని భూపాల్పల్లి పరిధిలో 199 కిలోమీటర్ల మేర రైల్వే కోల్కారిడార్ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. వందే భారత్ రైలు కోసం లైన్లను ఆధునీకరించినట్లు చెప్పినా అది వస్తుందో రాదో తెలియదు.
ఇక జాతీయ రహదారులను పట్టించుకున్నదీ లేదు. నిబంధనలను తుంగలో తొక్కి కర్ణాటక రాష్ర్టానికి రెండో ట్రిపుల్ ఐటీ ఇచ్చారే తప్ప అడిగినా కరీంనగర్కు ఇవ్వడం లేదు. మెగా పవర్లూం క్లస్టర్ మొరను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా ఎన్నో డిమాండ్లు ఉన్నా కేంద్రం మొండిచెయ్యే చూపుతున్నది. ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఉమ్మడి జిల్లాపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. గత ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పోరాడి మరీ ఎన్నో ప్రాజెక్టులు తెచ్చినా.. వాటిని సాధించడంలో ప్రస్తుతం ఎంపీ బండి సంజయ్ వైఫల్యం కనిపిస్తున్నది. బుధవారం కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా, ఈసారైనా సంజయ్ ఏమైనా సాధిస్తారా..? లేదంటే కేంద్రం ముందు మరోసారి బోర్లా పడుతారా..? అనే చర్చ జోరుగా సాగుతున్నది.
– కరీంనగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఉమ్మ డి జిల్లాపై నిర్లక్ష్యం చూపుతున్నది. రైల్వేలైన్లతోపాటు జాతీయ రహదారుల విషయంలో ఎనిమిదేళ్లుగా రిక్తహస్తమే కనిపిస్తున్నది. నామామాత్రపు నిధులు కేటాయిస్తున్నా.. అందులోనూ పూర్తి స్థా యిలో ఇవ్వకుండా వివక్ష చూపుతున్నది. నిజానికి దక్షిణ భారత దేశంలోనే గూడ్స్ రవాణాలో కరీంనగర్ రైల్వేస్టేషన్ అత్యధిక ఆదాయం ఇస్తున్నా ఆధునీకరిచడం లేదు. కరీంనగర్-తీగలగుట్టపల్లి ఆర్వోబీ అడుగు ముందు కు పడడం లేదు. ఇక జాతీయ రహదారుల విషయంలోనూ అంతులేని అలసత్వం ప్రదర్శిస్తున్నది. గత ఎంపీ వినోద్కుమార్ సాధించిన రహదారులకు నిధులు ఇవ్వడంలోనూ వివక్ష చూపుతున్నది. వాటిని సాధించడంలో ఎంపీగా బండి సంజయ్ పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారైనా ఉమ్మడి జిల్లా కు కేంద్ర బడ్జెట్లో ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా లేదా..? అన్న ఉత్కంఠ నెలకొన్నది. ఎంపీగానే కాదు.. రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ ఏమైనా సాధిస్తారా? లేదా..? అన్న దానిపై చర్చ జరుగుతోంది.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్కు నిధులు వచ్చేనా?
ఉమ్మడి జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉండే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ను గత ఎంపీ వినోద్కుమార్ కేంద్రంతో పోరాడి ఒప్పించారు. కేంద్రం సవాలక్ష కొర్రీలు పెట్టినా వాటిన్నింటికీ సీ ఎం కేసీఆర్ ఓకే చెప్పారు. అయినా అరకొర నిధు లే తప్ప కేంద్రం భారీ నిధులు కేటాయించడం లే దు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ పొడవు 151.34 కిలోమీటర్లు. అందులో మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్లు ఉండగా, అత్తెసరు నిధులే ఇవ్వడంతో ఇప్పటివరకు కేవలం 42.6 కిలోమీటర్ల మేర లైన్ మాత్రమే పూర్తయింది. రెండో దశలో గజ్వేల్ టూ దుద్దెడ దాకా 32 కిలోమీటర్లు పనులు నడుస్తున్నాయి. 2004లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆనాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ కొత్తపల్లి- మనోహరాబాద్ బ్రాడ్గేజ్ రైల్వేలైన్ను తెరపైకి తెచ్చా రు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ను రాజధానితో అనుసంధానం చేయాలన్న దూరదృష్టితో కేసీఆర్ ఈ లైన్ను ప్రతిపాదించారు.
కేసీఆర్ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నంత సేపు అంటే 2004 నుంచి 2006 దాకా ఈ లైన్కు సంబంధించిన ప్రక్రియ బాగానే సాగింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల మధ్య ఆప్పటి పాలకులు అటకెక్కించే ప్రయత్నం చేశారు. కాగా, 2014లో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన వినోద్కుమార్ ఈ లైన్ సాధనకు నిర్విరామ కృషిచేశారు. ఆ మేరకు రైల్వే బోర్డు పలు నిబంధనలు పెట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్టుకు అ య్యే వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వ మే భరించాలని, భూసేకరణ బాధ్యతను తీసుకోవాలని ఆంక్షలు పెట్టింది.
ప్రజల సంక్షేమం దృ ష్ట్యా ముఖ్యమంత్రి అన్నింటికీ ఒప్పుకున్నారు. ఆ మేరకు 2016 ఆగస్టు 7న మనోహరాబాద్- కొత్తపల్లి లైన్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అప్పటి అంచనా ప్రకారం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1161 కోట్లు అవుతాయని లెక్కలు వేశారు. 2017-18 బడ్జెట్లో 350 కోట్లు కేటాయించినా, అందులో 30 శాతం నిధులు ఇవ్వలేదు. 2022-23 బడ్జెట్లో 160 కోట్లు కేటాయించినా.. అందులోనూ సగం నిధులు కూడా రాలేదు. ఏటా బడ్జెట్లో ఇదే తంతు జరుగుతున్నది. ఈ సారైనా భారీగా నిధులు వస్తే తప్ప ప్రయోజనం ఉండదు. దీనిపై బండి సంజయ్ దృష్టిసారించాల్సిన అవసరమున్నది. నిజానికి ఈ లైన్ కోసం భారీగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాల్సిన సంజయ్, ఆ దిశగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం పూర్తి స్థాయి నిధులు ఇస్తుందా..? లేదా..? అన్నది చూడాలి.
వందే భారత్ వచ్చేనా..?
వందే భారత్ రైలు సేవలు ఉమ్మడి జిల్లా వాసులకు త్వరలోనే అందుతాయని బండి సంజయ్ ఇటీవల పేర్కొన్నారు. వందే భారత్కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచేందుకు ఏర్పా ట్లు చేసినట్లు రైల్వే అధికారులు ఇటీవల ప్రకటించారు. పెద్దపల్లి-కరీంనగర్ మధ్య 100 కిలోమీటర్ల స్పీడ్, కరీంనగర్-జగిత్యాల (లింగంపేట) మధ్య 90 కిలోమీటర్ల స్పీడ్, జగిత్యాల-నిజామాబాద్ మధ్య 100 కి.మీ, మేడ్చల్ -మనోహరాబాద్ 110 కిలోమీటర్లు స్పీడ్తో నడిపే విధంగా రైల్వేలైన్లను ఆధునీకరించినట్లుగా ప్రకటించారు. అయితే వందే భారత్కు సంబంధించి ఈ సారి ఏ మైనా ప్రకటన వెలువుడుతుందా..? అని ఉమ్మడి జిల్లావాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్-కాజీపేటకు నిధులేవి?
కరీంనగర్-కాజీపేట వయా హుజూరాబాద్ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కేంద్రాన్ని ఒప్పించిన విషయం తెలిసిందే. ఆ మేరకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసేందుకు రైల్వే బోర్డును ఒప్పించారు. దీనికి గత బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు. ఉమ్మడి జిల్లావాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ లైన్ విషయంలో కేంద్రాన్ని ఒప్పించి సంజయ్ నిధులు తెస్తారని భావించారు. కానీ, బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు.
ఈ సారి ఈ లైన్ గురించి కేంద్రానికి విన్నవించినట్లు ఇటీవల బండి ప్రకటించారు. ఆయన విన్నపాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా..? లేదా..? అన్నది ఈ బడ్జెట్ ద్వారా తెలియనున్నది. అయితే ఈ విషయంలో బండి సక్సెస్ అవుతారా..? లేక కేంద్రం ముందు బోర్లా పడతారా..? అన్నది చూడాలి. రామగుండం నుంచి మణుగూరు వయా మంథని భూపాల్పల్లి పరిధిలో 199 కిలోమీటర్ల మేర రైల్వే కోల్కారిడార్ ఏర్పాటుకు గతంలో సుముఖత చూపిన కేంద్రం, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇది ఏర్పాటైతే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించే అవకాశముంటుంది.
జాతీయ రహదారులపై పట్టింపు కరువే
జాతీయ రహదారులపై కేంద్రం అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నది. మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు 16వ లోక సభ్యుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ను ఉత్తర తెలంగాణలోనే జాతీయ రహదారుల జంక్షన్ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. ఆ మేరకు మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తిని కలుపుతూ 133 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 2016 నవంబర్ 24న కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ విషయంలో ఇటీవలి కాలంలో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తున్నా, ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. ఇక కరీంనగర్- సిరిసిల్ల- ఎల్లారెడ్డి-పిట్లం 164 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు 2016ఫిబ్రవరి 16న సూత్ర ప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపినా ఫలితం లేదు.
ఈ విషయంలో ఎంపీగా బండి సంజయ్ ఏనాడు శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. అలాగే జాతీయ రహదారి జంక్షన్ 353 సీ నుంచి భూపాల్పల్లి- అంశాన్పల్లి- గొర్లవీడు, నెరేడ్పల్ల్లి- గర్మిళపల్లి-బూరపల్లి- ఎమ్పెడ-వావిలాల- జమ్మికుంట-వీణవంక-కరీంనగర్ -131 కిలోమీటర్ల జాతీయ రహదారికి అంగీకరించి, 2,4, 6 లేన్లుగా అప్గ్రేడ్ చేస్తామని 2017 ఆగస్టు 31న కేంద్రం ప్రకటించినా.. నేటి వరకు మళ్లీ ఆ ఊసే ఎత్తడం లేదు. సిరిసిల్ల-సిద్దిపేట- దుద్దెడ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా నంబర్ 365బీగా ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 16న సమాచారం ఇచ్చినా, డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్టు కేంద్రం తెలిపినా తిరిగి పట్టించుకోలేదు.
భారత్ మాల జాబితాలోకి కరీంనగర్- వేములవాడ-సిరిసిల్ల-పిట్లం రోడ్డును చేరుస్తామని, తర్వలోనే ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో హామీ ఇచ్చారు. అలాగే కరీంనగర్- చల్లూరు-టేకుమట్ల- భూపాలపల్లి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ, నేటివరకు అతీ గతీ లేదు. ఉత్తర తెలంగాణలో జాతీయ రహదారుల హబ్గా కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణ కోసం 2016 జూన్ 24న ఎస్ఈ కార్యాలయాన్ని వినోద్కుమార్ ఆనాడు పట్టుబట్టి ఏర్పాటు చేయించారు. కానీ, నేడు పనులు లేక వెళ్లిపోయే పరిస్థితి ఉన్నది. ఈ విషయంలోనూ బండి ఏమాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఈ సారైనా ఈ బడ్జెట్ జాతీయ రహదారులకు మోక్షం కలుగుతుందా..? లేదా..? చూడాలి.
ట్రిపుల్ ఐటీ ఏది?
కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్లో లేఖ రాశారు. అయితే అది మనకు ఇవ్వకుండా, కర్ణాటక రాష్ర్టానికి రెండో ట్రిపుల్ ఐటీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీ చట్టం ప్రకారం చూసినా రాష్ర్టానికో ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి. ఈ నిబంధనలను తుంగలో తొక్కి కర్నాటక రాష్ర్టానికి రెండో ట్రిపుల్ ఐటీ ఇచ్చారు. అలా ఎలా ఇస్తారని మాజీ ఎంపీ వినోద్కుమార్ పలుసార్లు కేంద్ర విద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ విషయంలో ఆయన గతేడాది సెప్టెంబర్లో కేంద్ర విద్యాశాఖాధికారులతో కలిసి చర్చించారు.
ట్రిపుల్ ఐటీ కరీంనగర్కు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేసినా, నేటివరకు అతీ గతీ లేదు. ఆ దిశగా అడుగూ పడనూ లేదు. కరీంనగర్లో ట్రిపుల్ ఏర్పాటు చేయమని బండి ఈనాటికీ కోరలేదు. కేంద్రం నుంచి మెడికల్ కాలేజీ కూడా సాధించలేదు. ఇక జాతీయ రహదారుల ప్రస్తావనే లేదు. ట్రిపుల్ ఐటీ కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాసినా నేటి బడ్జెట్లో ఆ ఊసే లేదు. మెగా పవర్లూం క్లస్టర్ మొరను ఏమాత్రం పట్టించుకోలేదు. నేతన్నల సంక్షేమం కోసం.. బండి మెగా పవర్లూం క్లస్టర్ సాధిస్తారా..? లేదా..? అనే చర్చ జరుగుతున్నది. ఎక్కడ పడితే అక్కడ బండి బడాయిలు చెప్పడమే తప్ప చేసిందేమీ లేదనే అసహనం ప్రజల్లో కనిపిస్తున్నది.