సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ చాలా ఆసరైతంది. గతంల మమ్మల్ని ఏ సర్కారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే మంచి జరుగుతంది. ఒకప్పుడు నెలంతా బీడీలు చేస్తే రూ.రెండు మూడు వేలు రాకపోయేది. దీంతో ఇల్లు గడుసుడే కష్టమయ్యేది. బీడీ కార్మికుల గురించి ఎన్నడూ ఆలోచించలేదు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక మా బతుకుల్లో వెలుగులు నింపిండు. ఆయన చలువతోనే మాకు పింఛన్ వస్తంది. ప్రతి నెలా ఠంచన్గా రూ.2016లు బ్యాంకు ఖాతాల పడుతున్నయ్. ఆర్థిక సమస్యలు చాలా తగ్గిపోయినయ్. బీడీల పైసలతో పాటు పింఛన్ డబ్బులతో ఇల్లు గడుస్తంది. నాకు తెలిసి దేశంల ఒక్క తెలంగాణలనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నరు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మాకు మరింత మంచి జరుగుతది.
– కాటబోయిన నిత్య, బీడీ కార్మికురాలు (కొత్తపల్లి)
ఒకనాడు ఓ వెలుగు వెలిగిన బీడీ పరిశ్రమ, సమైక్య రాష్ట్రంలో కుచించుకుపోయింది. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీడీ కట్టలపై పుర్రెగుర్తు, శవం గుర్తులు ముద్రించి మహిళలకు ఉపాధి లేకుండా చేయడంతో పాటు వేలాది కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. ఆదాయం లేక ఇల్లు గడవని దుస్థితిలోకి వెళ్లిపోగా, రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు వారికి వెలుగురేఖగా నిలిచింది. పని కంటే ముందుగా సాయం చేయాలని భావించి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కార్మికులందరికీ జీవన భృతి కింద నెలకు 1000 పింఛన్ను అమలు చేసి జీవితాల్లో వెలుగులు నింపింది. దానిని 2018 నుంచి రూ.2016కు పెంచడం, కొద్దిరోజులుగా టేకేదారులకు సైతం సాయం చేస్తుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,44,653 మందికి లబ్ధి కలుగుతున్నది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మరో వెయ్యి పెంచుతామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించగా, కార్మికులు, టేకేదార్లు సంబురపడుతున్నారు. తమ జీవితాలకు ఆర్థిక భరోసానిచ్చిన దేవుడు కేసీఆర్ అంటూ కీర్తిస్తున్నారు.
– కరీంనగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)
బీడీ కార్మికులను ఆదుకోవాలని, వారికి ఉపాధి కల్పించాలన్న డిమాండ్ దాదాపు 20 ఏండ్ల నుంచి ప్రారంభమైంది. బీడీ కార్మికులకు ఉపాధి దొరకడం లేదని, వారిని ఆదుకోవాలన్న పోరాటం మొదలైంది. అయినా, సమైక్య రాష్ట్రంలో ఉన్న పాలకులు బీడీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రాలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కల్వకుంట్ల కవిత, బీడీ కార్మికుల ఉపాధిపై దృష్టి సారించారు.
కార్మికులకు పని కంటే ముందు సాయం అందించడమే ఉత్తమ మార్గంగా ఆమె గుర్తించారు. రాష్ట్రంలో ఉన్న 4.50 లక్షల బీడీ కార్మికుల దైన్య పరిస్థితిని సీఎం కేసీఆర్కు వివరించారు. వారిని ఆదుకోవాలని కోరారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్, బీడీ కార్మికులందరికీ నెలకు 1000 పెన్షన్ను జీవనభృతి పేరిట ఇవ్వాలని సంకల్పించారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఆరు నెలల వ్యవధిలోనే జీవనభృతి పంపిణీ మొదలు పెట్టారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీవనభృతిని 1000 నుంచి 2016కి పెంచారు.
బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వడం వల్ల జగిత్యాల జిల్లాకు పెద్ద మేలు జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని బీడీ కార్మికుల లబ్ధి కలుగగా, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని కార్మికులకు, టేకేదార్లకు సైతం ప్రయోజనం కలిగింది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని 1,42,653 మంది బీడీ కార్మికులకు జీవనభృతి మంజూరైంది. దాదాపుగా తొమ్మిదేండ్లుగా పింఛన్ పొందుతూ వస్తున్నారు. బీడీ పరిశ్రమ దెబ్బతినడంతో బీడీ కార్మికులతోపాటు, బీడీ టేకేదార్లు సైతం ఇబ్బందులకు లోనవుతుండడంతో వారిని సైతం ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. టేకేదార్లకు కూడా జీవనభృతిని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 2210 మంది టేకేదార్లకు జీవనభృతిని అందిస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బీడీ కార్మికులు. ఒక అసంఘటిత కార్మిక రంగంగా ఎదిగి రాష్ట్రంలోనే అతి పెద్ద కార్మిక సంఖ్యగా అవతరించిన పరిశ్రమ అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం వరకు తెలంగాణ పల్లెల్లో మహిళలకు తెలిసిన ఏకైక పని వ్యవసాయ కూలీ మాత్రమే. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని పట్టణాలకు, తర్వాత పల్లెలకు విస్తరించింది బీడీ తయారీ వృత్తి. మహారాష్ట్ర నుంచి ఎప్పుడైతే తెలంగాణకు బీడీ తయారీ వృత్తి పరిచయమైందో రైతు కూలీలుగా ఉన్న పలువురు మహిళలు ఇంటిపట్టునే ఉంటూ, బీడీ తయారీ చేసే వృత్తి వైపు ఆకర్షితులయ్యారు. దశాబ్ద కాలం గడిచేదాకా బీడీ తయారీ వృత్తిదారులు వందలు, వేలు దాటి లక్షలకు చేరుకున్నారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల సంఖ్యలో బీడీ కార్ఖానాలు, లక్షల సంఖ్యలో కార్మికులు తయారయ్యారు. చూస్తుండగానే బీడీ పరిశ్రమ వటవృక్షంలా పెరిగిపోయింది. అయితే, కాలగమనంలో బీడీ పరిశ్రమ అనేక ఒడిదొడుకులకు గురైంది. పరిశ్రమ ఇబ్బందులు పడడంతో దాని ప్రభావం కార్మికులపైనా పడింది. బీడీ వల్ల జరిగే అనర్థాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సైతం బీడీ కాల్చడం వల్ల జరిగే అనర్థాలపై ప్రచారం చేయడంతో బీడీ పరిశ్రమ కుచించుకుపోవడం మొదలైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీడీ కట్టలపై పుర్రెగుర్తు, శవం గుర్తులు ముద్రించాలని తీసుకున్న నిర్ణయం పరిశ్రమను చావుదెబ్బ తీసింది.
ఇది అల్టిమేట్గా కార్మికులపై ప్రభావం చూపింది. దీంతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా కుటీర పరిశ్రమగా భావించి, బీడీ తయారీపై ఆధారపడిన మహిళలకు ఉపాధి లేకుండా పోయింది. ఒకప్పుడు రోజుకు సగటున వెయ్యి నుంచి 1500 బీడీలు చేసిన కార్మికులకు, బీడీ కంపెనీదారులు రోజుకు 500 బీడీల తయారీకి కావాల్సిన ఆకు, తంబాకును సైతం అందించలేని దుస్థితికి వచ్చేశారు. ముడిపదార్థాల పంపిణీ లేకపోవడంతో కార్మికులు బీడీలు చేయలేక, ఉపాధి పొందలేని దైన్య స్థితిలోకి చేరుకున్నారు. ఆదాయం లేక ఇల్లు గడవని దుస్థితిలోకి వెళ్లారు.
బీడీ కార్మికులకు ఆసరా ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను కాదని, దొంగ హామీలిస్తున్న వారెందుకు. నేను 24 ఏండ్ల నుంచి బీడీలు చేస్తున్న. నా పేరు కొరె మహేశ్వరీ. నా భర్త మధు బట్టకు కుట్టుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాం. మాకు ఒక కొడుకు, కూతురు. వారిప్పుడు మంచిగా చదువుతున్నారు. కేంద్రం బీడీలపై పుర్రె గుర్తు పెట్టిన తర్వాత మా ఇంటిల్లిపాది ఉపాధి కరువై రోడ్డున పడ్డాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాకు రూ.1016 జీవనభృతి వస్తంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కల్వకంట్ల కవిత చొరవతో ఇప్పుడు పెన్షన్ రూ.2016 వస్తంది. కరోనా కష్టకాలంలోనూ ఇవే డబ్బులు మాకు ఆసరైనయి. మూడో సారి గెలిస్తే బీడీ పెన్షన్ పెంచుతానని కేసీఆర్ సారు హామీ ఇచ్చారు. తిన్న విశ్వాసం ఉండాలంటే కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను సీఎంగా గెలిపించుకోవాలి. ఇచ్చే వారిని వదిలేసి.. ఇస్తానని ఇంటికోచ్చే ఇతర పార్టీల వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి ఎన్నికల్లో మా కుటుంబం నుంచి రెండు ఓట్లు మాత్రమే కారు గుర్తుకు వేసి గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు మా కుటుంబం నుంచి నాలుగు ఓట్లు కారు గుర్తుకే వేసి మళ్లీ మూడోసారి సీఎంగా కేసీఆర్ను గెలిపించుకొంటాం.
– కోరె మహేశ్వరి, బీడీ కార్మికురాలు, మెట్పల్లి
ఏండ్ల సంది బీడీలు చేసుకుంట బతుకుతున్నం. చేసుకుందామంటే ఇంకో పని రాదాయే. కాంగ్రెస్ గవర్నమెంటున్నప్పుడు పుర్రెగుర్తని పెట్టి బీడీలను దెబ్బతీసిండ్రు. అప్పటి నుంచి కంపెన్లన్ని నడుత్తలేవు. నెలలు బీడీలు బంద్పెట్టి పోరాటం చేసినం. దేశమంతా కదిలివచ్చినంక పుర్రెగుర్తు తీసేసిండ్రు. అయినా బీడీల పని తగ్గింది. అప్పటోలే లేదు. ఖర్చులేమో ఎక్కవైనయ్. కూలీ తక్కువైంది. కేటీఆర్ అన్న మా బాధలను దగ్గరుండి చూసిండు. పొద్దంతా కూసుండి చేసినా పొట్టగడవదని తెలుసుకుని మాకు నెలకు రూ.2,016 పింఛన్ ఇస్తున్నడు. ఆ పైసలే మాకు ఆసరా అయితన్నయ్. అవికూడ పెంచుతమని చెప్పిండు. మా కెంతో సంతోషగున్నది. బీడీలు తప్ప ఇంకో పనిరాని మాకు కేటీఆర్ సారు ఉన్నడన్న ధైర్యంతో బతుకుతున్నం. రామన్న సారు వచ్చినంకనే సిరిసిల్ల మంచిగైంది.
– తౌటు రాధ, బీడీ కార్మికురాలు (సిరిసిల్ల)
బీడీలు చుట్టేవాళ్లను కార్మికులుగా గుర్తించడమే గొప్ప విషయం. అందులో మాలాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించి అడుగకున్నా పింఛన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. బీడీ పరిశ్రమకు ప్రమాదం పొంచి ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం నుంచి బీడీ కార్మికులకు అందుతున్న పింఛన్తోటి కొంచెం పరిశ్రమ బతికి బట్టకడుతున్నది. లేకపోతే చానా ఇబ్బంది అయ్యేది. పింఛన్తోటి చాలా మంది మహిళలకు ఆర్థిక భరోసాను ప్రభుత్వం కల్పించినట్లయ్యింది. మహిళా బీడీ కార్మికుల తరఫున సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– మంద సాయికృష్ణ, బీడీ టేకేదార్, (జూలపల్లి మండలం)
బీడీ టేకేదార్లు అనే వాళ్లు ఉన్నారని, వారిని ఆదుకోవాలని అన్నది ఒక్క సీఎం కేసీఆర్ సారే. బీడీ పరిశ్రమ ఉన్నప్పుడు మంచిగానే ఉండేది. బీడీలు తక్కువ అవుడు మొదలు కాంగనే తిప్పలు మొదలయ్యాయి. ఎవరూ పట్టించుకోలేదు. కార్మికులకు పెన్షన్ ఇచ్చిండ్రు. మమల్ని మాత్రం ఆదుకున్నోళ్లు లేరు. టేకేదార్లు ఏం ధనవంతులు కాదు. మస్తుసార్లు పెద్దపెద్ద సార్లకు చెప్పినం. చివరకు ముఖ్యమంత్రి సారే మమల్ని గుర్తించిండు. మాకు గూడ పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టిండు. ఇప్పుడు నెలకు రెండువేల పెన్షన్ వస్తంది. మళ్లీ పెంచుతాను అంటుండు. సంతోషం. ఈ పెన్షన్ వల్ల జిల్లాలో వెయ్యి, 1200 మందికి పెన్షన్ వస్తుంది. అట్లట్ల నడుస్తున్న కంపెనీలు రెండుమూడేండ్ల కంటే ఎక్కువ నడువవు. ఇక పింఛనే మాకు ఆధారం. సీఎం కేసీఆర్ మమల్ని గుర్తించిండ్రు. మా జీవితాలు బాగుంటాయి. అన్న నమ్మకం ఏర్పడ్డది.
– కట్కం లింగం, టేకేదారు, జగిత్యాల