Electricity Department | ముకరంపుర, జూన్ 15 : కరీంనగర్ నగర శివారు రేకుర్తిలోని షేకాబీ కాలనీ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ దిగువన ఉన్న పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడున్న పరిస్థితి విద్యుత్ అధికారులు, సిబ్బందికి క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం విషయంలో చూపుతున్న అంతులేని నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతుంది.
క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సంస్థ సీఎండీ సూచిస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. విద్యుత్ తీగలను ఈత చెట్టు ఆకులు అస్తవ్యస్తంగా అల్లుకుపోయిన తీరే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా చేతికి అందే ఎత్తులో ఉన్న కరెంటు తీగలు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉన్నాయి. అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.