ఇటీవలి బదిలీల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తున్నది. ట్రాన్స్ఫర్లు జరుగుతున్న తీరు అన్ని విభాగాల అధికారులను అయోమయానికి గురిచేస్తున్నది. పోలీస్ శాఖలో మరీ గందరగోళంగా ఉన్నది. ఉదయం ఉత్తర్వులు రావడం, జాయిన్ అవ్వడానికి ముందే రద్దు కావడం, ఆ స్థానంలో కొత్త వారికి పోస్టింగులు ఇవ్వడం, ఒక వేళ జాయిన్ అయినా వారంలోపే మళ్లీ బదిలీ కావడం జరుగుతున్నది. ఏ పోస్టు ఎప్పుడు ఉంటుందో..? ఊడుతుందో..? తెలియక ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం ఎన్నికల ట్రాన్స్ఫర్లు కొనసాగుతుండగా.. ఇదే సమయంలో రాజకీయ జోక్యం ఉంటున్నట్టు తెలుస్తున్నది. కొంత మంది అధికార పార్టీ నాయకులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లే మాటిమాటికి బదిలీ ఉత్తర్వులు మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో బదిలీలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో వణుకు పుట్టిస్తున్నాయి. పోస్టింగ్ ఉత్తర్వులు చేత పట్టుకొని, తట్టా బుట్ట సర్దుకొని జాయిన్ కావడానికి ప్రిపేర్ అయ్యేలోపే రద్దవుతున్నాయి. ఒకే వేళ జాయిన్ అయినా కొంత మందికి వారం తిరిగేలోపే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన అనేక పోస్టింగ్లు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీగా పనిచేస్తున్న ఉమేందర్ను రామగుండం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వచ్చాయి. ఆయన జాయిన్ అవడానికి ప్రిపేరవుతున్న సమయంలోనే.. సదరు ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఆ స్థానంలో కొత్తగూడెం జిల్లా మణగూరులో పనిచేస్తున్న రాఘవేందర్రావుకు పోస్టింగ్ ఇచ్చారు.
నిజానికి పై స్థాయి అధికారులకు కూడా ఈ బెడద తప్పలేదు. గతంలో రామగుండం కమిషనరేట్ సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని మొదట బదిలీ చేసిన ప్రభుత్వం, ఆ స్థానంలో డీఎస్ చౌహాన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన జాయిన్ కాకుండా కొంత మంది నాయకులే అడ్డుపడినట్టు తెలిసింది. అయితే ఆ స్థానంలో రెమా రాజేశ్వరియే కొన్నాళ్లపాటు కొనసాగారు. తర్వాత వరంగల్ సీపీ తరుణ్జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆ తర్వాత ఇటీవల వెలువడిన బదీలీల్లో ఎం శ్రీనివాసులును సీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అలాగే పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ను బదిలీ చేసి, ఆయన స్థానంలో శ్రీనివాస్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, మరుసటి రోజే ఆ స్థానంలో గజ్జి కృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది పోలీస్శాఖలో చర్చనీయాంశమైంది. రామగుండం ట్రాఫిక్ సీఐగా పనిచేసిన ప్రవీణ్కుమార్ను పోలీస్ సీఐగా బదిలీచేశారు. ఆయన చేరేలోపే ఆయన స్థానంలో వీ రవి వచ్చారు. మూడు రోజులు కాకముందే జమ్మికుంట సీఐగా ఇతన్ని బదిలీ చేశారు. కాగా, తాజాగా ట్రాఫిక్ సీఐగా రాజేంద్ర ప్రసాద్కు పోస్టింగ్ ఇచ్చారు.
జగిత్యాల జిల్లాకు సంబంధించి పోలీస్ అధికారుల బదిలీల్లో రెండుమూడు మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు కరీంనగర్ టౌన్ నుంచి జగిత్యాల టౌన్ సీఐగా నటేశ్ బదిలీపై వచ్చారు. కాగా, ఎన్నికల తర్వాత ఆయనను ఐజీ వరంగల్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆదిలాబాద్లో సీఐగా పనిచేస్తున్న బుద్ది స్వామిని జగిత్యాల టౌన్ సీఐగా బదిలీ చేశారు. అయితే వారం వ్యవధిలోనే ఈ ఆర్డర్లో మార్పులు చేశారు. సీఐ నటేశ్ జగిత్యాల టౌన్లో రిలీవ్ కాలేదు. అదే సమయంలో బుద్ది స్వామి సైతం జగిత్యాల జిల్లాలో రిపోర్ట్ చేయలేదు.
నటేశ్ను జగిత్యాల టౌన్ సీఐగా కొనసాగిస్తూ, బుద్ది స్వామిని రామగుండం కమిషనరేట్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నటేశ్తోపాటే ధర్మపురి, మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. ధర్మపురిలో పనిచేస్తున్న రమణమూర్తిని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. సతీశ్కు సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే మల్యాలలో పనిచేస్తున్న సీఐ బిల్ల కోటేశ్వర్ను బదిలీ చేసి, జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్రావుకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఈ రెండు పోస్టులను సైతం వారం రోజుల వ్యవధిలో మార్చి వేశారు. ధర్మపురిలో సతీశ్ను మార్చి, రామనర్సింహారెడ్డిని సీఐగా నియమించారు. ఇక మల్యాలకు బదిలీ చేసిన నాగేశ్వర్రావును తిరిగి జగిత్యాల హెడ్ క్వార్టర్కు, కరీంనగర్ కమిషనరేట్లో పనిచేస్తున్న సీఐ దామోదర్రెడ్డిని బదిలీ చేశారు.
ఇలా జగిత్యాల సబ్ డివిజన్లోని ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వారం వ్యవధిలోనే మళ్లీ వారిని బదిలీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇటీవలే నిర్వహించిన ఎస్ఐ బదిలీల్లోనూ ఒక మార్పు చోటు చేసుకున్నది. గతంలో జగిత్యాల రూరల్లో ఎస్ఐగా పనిచేసిన ఏ అనిల్ను వెల్గటూర్ ఎస్ఐగా బదిలీ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఎస్ఐగా ఉమాసాగర్కు పోస్టింగ్ ఇచ్చారు. అయితే రెండు రోజుల వ్యవధిలోనే ఈ మార్పులు జరిగాయి. వెల్గటూర్ ఎస్ఐ అనీల్ను ఇబ్రహీంపట్నంకు, ఉమాసాగర్ను ఇబ్రహీంపట్నం నుంచి వెల్గటూర్కు బదిలీ చేయడం గమనార్హం. అందులో కొన్ని పోస్టుల్లో భారీగా డబ్బులు మారాయన్న ఆరోపణలున్నాయి.
మంథని ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న తూము రవీందర్ను రెవెన్యూ బదిలీల్లో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. అయితే ఓ నేత అండదండలతో తిరిగి మళ్లీ పూర్వ స్థానానికే పోస్టింగ్ తెచ్చుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయంలో డిప్యూటేషన్ మీద పనిచేస్తున్న ఆర్టీవో రంగరావు, రవాణాశాఖలో డిప్యూటేషన్లు రద్దు కావడంతో తిరిగి తన సొంత పోస్టింగ్ అయిన వరంగల్కు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న ఆఫ్రిన్ సిద్ధిఖీ ఈ జిల్లాకు వచ్చారు. మళ్లీ పది రోజుల్లోనే ఆర్టీవో రంగారావు తిరిగి పెద్దపల్లి ఆర్టీవోగా రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అలాగే అదే కార్యాలయంలో ఎనిమిదేళ్లుగా ఏంవీఐగా విధులు నిర్వర్తిస్తున్న అల్లె శ్రీనివాస్ బదిలీపై వెళ్లారు.
ఇటీవలే బదిలీపై హుజూరాబాద్ నుంచి వచ్చన ఎంవీఐ సిరాజ్ నెల తిరగకుండానే వెనక్కి వెళ్లిపోయారు. పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో సీ సెక్షన్ సూపరిండెంట్గా పనిచేస్తున్న బండి ప్రకాశ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. తిరిగి వారం రోజుల్లోనే పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో సీ సెక్షన్కు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా చేసిన బదిలీల్లో అంతా అయోమయం నెలకొన్నది. రాజకీయ నేతలు తమకు సహకరించే వారిని తెచ్చుకునేందుకు జోక్యం చేసుకోవడంతోనే ఎన్నడూ లేని విధంగా బదిలీలు గందరగోళంగా మారడానికి కారణమని ఆయా ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.