మానకొండూర్ రూరల్, అక్టోబర్ 31: ‘మీ ఆశీర్వాదమే తనకు కొండంత అండ. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు. ముందుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం మానకొండూర్ మండలం అన్నారం హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి, ప్రచారం చేశారు. ఆ తర్వాత అన్నారంతోపాటు లలితాపూర్, దేవంపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి మాట్లాడారు. పదేండ్లలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఎన్నికల తర్వాత రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతోనే బతుకమ్మ చీరల పంపిణీ, రైతుబంధు పథకాన్ని ఆపాల్సి వచ్చిందన్నారు. దీనిపై ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు సూచించారు. జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, మానకొండూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్దేనన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆయనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. అన్నారంలో దాదాపు 50 మంది యువకులకు బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికి వచ్చిన రసమయి బాలకిషన్కు మహిళలు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు బొట్ల కిషన్, మర్రి కొండయ్య, ఉప సర్పంచులు మూగల మహేందర్ రెడ్డి, బండారిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు గొల్లపల్లి రాజనర్సు, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు పడకంటి వీరేశం, పుల్లూరి శ్రీనివాస్, మహేందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల వంశీధర్ రెడ్డి, మానకొండూర్ సొసైటీ అధ్యక్షుడు నల్ల గోవింద రెడ్డి, సీనియర్ నాయకులు మాధవరం దామోదర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, రైతు బంధు సమితి కన్వీనర్లు, సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.