పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ (Double-Bedroom) ఇళ్లను నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ( Collector Koya Sri Harsha ) ఆదేశించారు.
శనివారం రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి పరిశీలించి, అక్కడి మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్ల వద్ద నీరు, విద్యుత్, రహదారులు తదితర ప్రాథమిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని స్పష్టం చేశారు. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జంగాలపల్లి, పాములపేటలో ప్లాట్లు పొందిన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రామగుండం మండలంలోని న్యూ మారేడుపాకలో ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, రామగుండం తహసీల్దార్ రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.